డాక్టర్‌కు అండగా నిలబడిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు

5 Jun, 2021 18:53 IST|Sakshi

సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కొత్తపుట్టుగకు చెందిన పీహెచ్‌సీ వైద్యాదికారి ఎన్‌.భాస్కరరావు ప్రకాశం జిల్లా కారంచేడు పీహెచ్‌సీ వైద్యాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇటీవలే కరోనా బారిన పడి ఆసుపత్రి పాలయ్యారు. ఆయనకు ఊపిరితిత్తులు మార్చాలని తేల్చిన వైద్యులు అందుకు రూ.1.50 కోట్లకు పైగా ఖర్చవుతుందని చెప్పారు.  అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో డాక్టర్‌ భాస్కరరావు కుటుంబ సభ్యులు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆశ్రయించారు. బాలినేని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తక్షణం స్పందించిన ముఖ్యమంత్రి జగన్.. అతడి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.కోటి వెంటనే చెల్లించాలని, అవసరమైతే మరో రూ.50 లక్షలు చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారని మంత్రి బాలినేని తెలిపారు.

ఆయన చికిత్సకు అయ్యే ఖర్చును రాష్ట్రం ప్రభుత్వం ముందుకు రావడంతో ఏపీ గవర్నమెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ శనివారం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపింది.  వారు స్పందిస్తూ..  '' ఆపదలో ఆపదలో ఆదుకున్న సీఎం వైఎస్ జగన్ ఉదారతకు  ఇవే మా కృతజ్ఞతలు. కష్టకాలంలో తోడుగా నిలిచిన సీఎంకు అభినందనలు తెలుపుతున్నాం.  కరోనా విపత్తులో కారంచేడులో డాక్టర్ భాస్కర్‌రావు వైద్య సేవలు అందించారు. ఆరు వేల మందికి పైగా కోవిడ్ పరీక్షలు చేశారు. దురదృష్టవశాత్తూ ఆయన కరోనా బారిన పడి ఆస్పత్రిలో చేరారు. ఖరీదైన వైద్యం చేస్తే గానీ .. ప్రాణాలు నిలబడిని పరిస్థితికి భాస్కర్‌రావు ఆరోగ్యం చేరుకుంది. దీంతో దిక్కుతోచని స్థతిలో ఉన్న  ఆయన కుటుంబానికి సీఎం వైఎస్ జగన్ అండగా నిలిచారు. అత్యంత ఖరీదైన వైద్యానికి ఖర్చులు భరించేందుకు వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ పట్ల తన చిత్తశుద్ధిని మరోసారి సీఎం చాటుకున్నారు. సీఎం స్పందించిన తీరుతో మా బాధ్యత మరింత పెరిగిందని'' తెలిపారు.

కాగా డాక్టర్‌ ఎన్‌.భాస్కరరావు ప్రకాశం జిల్లా కారంచేడు పీహెచ్‌సీ వైద్యాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నతాధికారుల ఆదేశాలతో సుమారు 6 వేల మందికి కోవిడ్‌–19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్‌గా తేలిన వారెందరికో అండగా నిలబడ్డారు. ఆయన అందించిన వైద్యంతో వేలాది మంది కోవిడ్‌ బారినుంచి బయటపడ్డారు. ఏప్రిల్‌ 24న ఆయనకు కరోనా సోకింది. నెలాఖరు వరకు హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండి వైద్యం పొందారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో భార్య డాక్టర్‌ భాగ్యలక్ష్మి ఆయనను విజయవాడ ఆయుష్‌ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ 10 రోజుల వైద్యం తరువాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ యశోదా హాస్పిటల్, తరువాత గచ్చిబౌలిలోని కేర్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందారు. ఊపిరితిత్తులు పూర్తిగా పాడవటంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలుగుతుండటంతో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందిస్తున్నారు.
చదవండి: Andhra Pradesh: ఆ వైద్యుడి చికిత్స ఖర్చు ప్రభుత్వానిదే..!

మరిన్ని వార్తలు