సహజ వాయువుపై పన్ను పెంపు

12 Sep, 2020 12:13 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సహజవాయువుపై ఏపీ వ్యాట్ చట్టం ప్రకారం పన్ను పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 14.5 శాతం నుంచి 24.5 శాతానికి విలువ ఆధారిత పన్నును పెంచుతూ వాణిజ్య పన్నుల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే ఐదు రకాల పెట్రోలియం ఉత్పత్తులపై విలువ ఆధారిత పన్నును ప్రభుత్వం వసూలు చేస్తోంది. ముడి చమురు పై 5 శాతం మేర, పెట్రోలుపై 31 శాతంతో పాటు అదనంగా 4 రూపాయల మేర పన్ను వసూలు చేస్తుంది. డీజిల్ పై 22.5 శాతంతో పాటు అదనంగా 4 రూపాయలు, ఎయిర్ టర్బైన్ ఫ్యూయెల్ పై 1 శాతం మేర వాణిజ్య పన్నుల శాఖ వ్యాట్ వసూలు చేస్తుంది.(చదవండి: పెళ్లైన 20 రోజులకే భర్తను చంపిన భార్య

కోవిడ్ కారణంగా పన్నులపై  ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ మే, జూన్, జూలై, ఆగస్టు నెలలకు ఆదాయం కోల్పోయినందున సహజవాయువుపై అదనంగా 10 శాతం మేర వ్యాట్ పెంచుతున్నట్టు  ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏప్రిల్ 2020 నెలకు 4480 కోట్ల రూపాయల ఆదాయం రావాల్సి ఉన్నా కేవలం 1323 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. రైతు భరోసా, నాడు నేడు, టెలి మెడిసిన్, సున్నా వడ్డీ, జగనన్న విద్యా దీవెన, వాహన మిత్ర, జగనన్న చేదోడు, అమ్మఒడి లాంటి పథకాలకు నిధులు కావాల్సి ఉన్నందున సహజ వాయువుపైనా పన్ను పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

మరిన్ని వార్తలు