14,936 కోట్ల రూపాయల బకాయిల చెల్లింపు    

31 Aug, 2020 08:05 IST|Sakshi

వివిధ పథకాలకు రూ.60వేల కోట్లు చెల్లించని టీడీపీ సర్కారు 

ఆరోగ్యశ్రీ, రైతులకు సున్నావడ్డీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎగ్గొట్టిన గత సర్కారు

ఏడాదిలో పెద్ద మొత్తంలో చెల్లించిన ప్రస్తుత ప్రభుత్వం

సాక్షి, అమరావతి: గత తెలుగుదేశం ప్రభుత్వం నిర్వాకం రాష్ట్రాన్ని ఆర్థికంగా కుంగదీస్తోంది. నాటి సర్కారు చెల్లించని రూ.60 వేల కోట్ల బకాయిలు ఇప్పటి ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయి. వివిధ కార్పొరేషన్ల నుంచి పెద్దఎత్తున రుణాలు తీసుకుని ఇతర అవసరాలకు అప్పటి టీడీపీ సర్కారు మళ్లించేసింది. దీంతో ఈ బకాయిల బండ ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై పడింది. అయినా, క్రమపద్ధతిలో వాటిని ప్రస్తుత సర్కారు తీర్చుకుంటూ వస్తోంది. ఇలా ఈ ఏడాది కాలంలో రూ.14,936 కోట్లను చెల్లించింది. టీడీపీ సర్కారు నిర్వాకాలివీ.. రైతులకు ఉచిత విద్యుత్‌ సరఫరా కింద ప్రతీనెలా చెల్లించాల్సిన నిధులను చెల్లించకుండా పెద్దఎత్తున బకాయిలను పెట్టింది.

ఆరోగ్యశ్రీ కింద ఆస్పత్రులకు పెద్దఎత్తున చెల్లింపులు చేయలేదు.
రైతులకు చెల్లించాల్సిన సున్నా వడ్డీ డబ్బులకు ఎగనామం పెట్టింది. 
విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సొమ్మును ఇవ్వలేదు. వీటికితోడు.. వివిధ రకాల పనులకు సంబంధించిన బిల్లులను పెద్ద మొత్తంలో పెండింగ్‌లో పెట్టి ఖాళీ ఖజానాను తర్వాత వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి అప్పగించింది. 
ఈ బకాయిలను ప్రస్తుత ప్రభుత్వం ఏడాది కాలంగా ప్రాధాన్యతా క్రమంలో తీర్చుకుంటూ వస్తోంది. కోవిడ్‌–19 లాక్‌డౌన్‌ నేపథ్యంలో సర్కారుకు ఆదాయం పడిపోయినప్పటికీ రైతుల ప్రయోజనానికే అత్యధిక ప్రాధాన్యతనిస్తూ సున్నా వడ్డీ బకాయిల సొమ్మును ఏకంగా 57 లక్షల రైతుల ఖాతాలకు రాష్ట్ర ప్రభుత్వం జమచేసింది.

మరిన్ని వార్తలు