విజ్ఞానం పంచుకునే ‘ట్విన్నింగ్‌’

15 Sep, 2020 07:29 IST|Sakshi

పాఠశాలల మధ్య టీచర్లు, విద్యార్థుల మార్పిడి

వారం పాటు ఇతర స్కూళ్లలో గడిపే అవకాశం

ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు

సాక్షి, అమరావతి: పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య పరిజ్ఞానాన్ని పరస్పరం పంచుకునేలా కేంద్రం తలపెట్టిన ‘ట్విన్నింగ్‌’ కార్యక్రమాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని ఏపీ సమగ్ర శిక్ష నిర్ణయించింది. పార్ట్‌నర్‌షిప్, టీచర్‌ ఎక్స్చేంజ్‌ ప్రోగ్రాం కింద ఎంపిక చేసిన 50 పాఠశాలల్లో దీన్ని అమలు చేయనున్నారు. 

► ట్విన్నింగ్‌ ద్వారా గ్రామీణ, గిరిజన ప్రాంతాల పాఠశాలలను పట్టణ, సెమీ అర్బన్‌ పాఠశాలలతో పరస్పరం అనుసంధానిస్తారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య విజ్ఞానాన్ని  పంచుకోవడం అనుసంధానం లక్ష్యం.  

► విద్యార్థులు ఇతర పాఠశాలల్లో వారం రోజులు గడపడం ద్వారా అక్కడ అనుసరిస్తున్న విధానాలను పరిశీలించేందుకు అవకాశం కల్పిస్తారు.  

► సెకండరీ, సీనియర్‌ సెకండరీ విద్యార్థులు, టీచర్లకు మాత్రమే ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని సమగ్ర శిక్షా ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్లను ఆదేశించారు. కార్యక్రమం అమలు తేదీ తర్వాత ప్రకటిస్తారు.  

► ఇతర పాఠశాలలను సందర్శించడం ద్వారా విద్యార్థులకు బోధనా ప్రక్రియ, నాణ్యత, సమస్యలు, స్పెషల్‌ ఇన్నోవేటివ్‌ ప్రాజెక్టులు, సైన్స్‌ ఫెయిర్‌ లాంటివి పరిశీలించే అవకాశం కలుగుతుంది.  

► కళలు, చేతివృత్తులు, సాంస్కృతిక, సాహిత్య, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు (ఎన్‌సీసీ, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌) లైఫ్‌ స్కిల్స్‌ లాంటివి పెంపొందించుకునే అవకాశం కలుగుతుంది. 

► పాఠశాల నిర్వహణలో సమాచార వ్యవస్థ, కమిటీల పాత్ర, పనితీరు గురించి తెలుస్తుంది.    

>
మరిన్ని వార్తలు