AP: పురావస్తు ప్రదర్శనశాలల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు 

6 Mar, 2023 07:28 IST|Sakshi

రాష్ట్రంలో పురావస్తు ప్రదర్శనశాలల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు 

విశాఖలో వైఎస్సార్‌ పేరుతో స్టేట్‌ మ్యూజియం  

కర్నూలు, కాకినాడ, గుంటూరుల్లో కొత్త భవనాలకు ప్రతిపాదనలు 

శాసన మ్యూజియం ఏర్పాటుకు సన్నాహాలు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పురావస్తు ప్రదర్శనశాలలకు (మ్యూజియాలకు) ప్రభుత్వం కొత్తకళ తీసుకురానుంది. శిథిలావస్థలోని మ్యూజియం భవనాల స్థానంలో కొత్త భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. మ్యూజియాల్లో అంతర్జాతీయస్థాయి సాంకేతిక ప్రమాణాలతో ఆంటిక్విటీస్‌ (పురాతన వస్తువులు) డిస్‌ప్లే చేసేలా ప్రత్యేకదృష్టి సారిం చింది. తాజాగా విశాఖపట్నంలో దివంగత ముఖ్యమంత్రి     వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరుతో స్టేట్‌ మ్యూజియాన్ని నిరి్మంచనుంది. మరోవైపు కడపలోని భగవాన్‌ మహావీర్‌ మ్యూజియం, గుంటూరులోని బుద్ధశ్రీ మ్యూజియం, కర్నూలులోని జిల్లా మ్యూజియాల్లో కొత్త భవనాలు, ఇతర అభివృద్ధికి రూ.10 కోట్ల చొప్పున డీపీఆర్‌లను రూపొందించింది. 

శాసనాల పరిరక్షణకు..  
రాష్ట్ర  పురావస్తుశాఖ ఆధ్వర్యంలో లక్షలాది శాసనాలు, ఎస్టేంపేజీలు (శాసనాల కాపీలు) ఉన్నాయి. వీటిని భవిష్యత్తు తరాలకు అందించేందుకు, రాష్ట్ర సాంస్కృతిక, వారసత్వ సంపదను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వీలుగా ప్రత్యేక ‘శాసన మ్యూజియం’ నిర్మాణానికి చర్యలు చేపడుతోంది. తద్వారా ఇప్పటివరకు లభ్యమైన శాసనాల వివరాలను ఒకేవేదికపై ప్రజలకు అందుబాటులో ఉంచనుంది. 

పెండింగ్‌లో రూ.436.50 కోట్ల డీపీఆర్‌లు 
రాష్ట్రంలోని పురావస్తు ప్రదర్శనశాలలతో పాటు వారసత్వ నగరాల అభివృద్ధి, ఆంటిక్విటీస్‌ డిజిటలైజే‹Ùకు సంబంధించి రూ.436.50 కోట్ల డీపీఆర్‌లు  కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో రూ.400 కోట్లతో రాజమహేంద్రవరాన్ని వారసత్వ నగరంగా తీర్చిదిద్దనున్నారు. వైఎస్సార్‌ జిల్లాలోని మైలవరం, శ్రీసత్యసాయి జిల్లాలోని పెనుకొండ, జిల్లా కేంద్రం కాడినాడలోని ఆంధ్రసాహిత్య పరిషత్‌ మ్యూజియాల డీపీఆర్‌లకు అనుమతులు రావాల్సి ఉంది. 

మ్యూజియాల్లో ప్రవేశపెట్టే అంతర్జాతీయస్థాయి సాంకేతికత ఇలా..
- ఇంటరాక్టివ్‌ రెస్పాన్సివ్‌ డిజిటల్‌ వాల్‌ 
- వర్చువల్‌ రియాలిటీ టెక్నాలజీ 
- ఇంటరాక్టివ్‌ డిస్‌ప్లే కియోస్క్‌ 
- ఆడియో–వీడియో టెక్నాలజీ 
- ప్రొజెక్షన్‌ మ్యాపింగ్, డిజిటల్‌ బుక్‌ 

వారసత్వ విలువలను ప్రోత్సహించాలి 
ఏపీలోని మ్యూజియాలను అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నాం. మన అద్భుతమైన సంస్కృతి, వారసత్వ విలువలను ప్రోత్సహించాలి. ఇందులో భాగంగానే ఇప్పటికే కొన్ని డీపీఆర్‌లు కేంద్రానికి పంపగా.. కొత్తగా మరో నాలుగు మ్యూజియాలకు భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ఇకపై సామాజిక మాధ్యమాల ద్వారా మన మ్యూజియాల్లోని విశిష్టతను ప్రచారం చేయనున్నాం.  
– జి.వాణీమోహన్, కమిషనర్, పురావస్తుశాఖ 

మరిన్ని వార్తలు