AP: ప్రొబేషన్‌ డిక్లరేషన్‌పై హర్షం 

20 Jun, 2022 07:47 IST|Sakshi

సీఎం జగన్‌కు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, సచివాలయ ఉద్యోగుల కృతజ్ఞతలు  

సాక్షి, అమరావతి/మద్దిలపాలెం: సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లరేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి. సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన మేలు మరిచిపోలేమంటూ కృతజ్ఞతలు తెలియజేశాయి. ఆదివారం విశాఖలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.అస్కారరావు మీడియాతో మాట్లాడుతూ.. సీఎంగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు స్వీకరించిన వెంటనే లక్షలాది మందికి ఉద్యోగాలివ్వడం గొప్ప విషయమన్నారు. వారి సర్వీసును రెండున్నరేళ్లలోనే క్రమబద్ధీకరించడం చరిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు.

ఉద్యోగుల బదిలీల ప్రక్రియ గడువు పొడిగించాలని.. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన కౌన్సెలింగ్‌ నిర్వహించాలని కోరిన వెంటనే ప్రభుత్వం స్పందించిందన్నారు. జీవో 64ను రద్దు చేయాలని, క్షేత్రస్థాయి సిబ్బందికి బయోమెట్రిక్‌లో మినహాయింపు ఇవ్వాలని కోరారు. సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ అమలు చేయాలని, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. జీవో 117ను రద్దు చేయాలని టీచర్లు చేపడుతున్న ఉద్యమానికి మద్దతిస్తున్నట్టు చెప్పారు. సంఘం నాయకులు ఎస్వీ రమణ, జవహర్‌లాల్, శ్రీకాంత్‌రాజు పాల్గొన్నారు. కాగా, ప్రొబేషన్‌ డిక్లరేషన్‌పై సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. 

మరిన్ని వార్తలు