ఏపీలో కొత్తగా 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు

16 Oct, 2020 13:19 IST|Sakshi

కొత్తగా 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఉత్వర్వులు

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ ‌జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకంలోనూ బీసీలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీసీ కులాల జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 139 బీసీ కులాలకు వెనుకబడిన తరగతుల శాఖ కొత్తగా 56 బీసీ కార్పొరేషన్లును ఏర్పాటు చేసింది.  పది లక్షలకు పైన జనాభా ఉన్న కార్పొరేషన్‌లను ‘ఏ’ కేటగిరీ కింద, లక్ష నుంచి పది లక్షల వరకు జనాభా ఉన్న కార్పొరేషన్‌లను ‘బి’ కేటగిరీ కింద, లక్షలోపు జనాభా ఉన్న కార్పొరేషన్‌లను ‘సి’ కేటగిరీ కింద విభజించారు. అలాగే ఈ నెల 18న బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల నియామకం చేపట్టనుంది. చదవండి: దేశ చరిత్రలో తొలిసారి ఏపీ ప్రభుత్వం‌ కీలక నిర్ణయం

వెనుకబడిన కులాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వేగంగా లబ్దిదారులకు అందేలా ఈ కార్పొరేషన్లు సహకరిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. 139 బీసీ కులాలకు ప్రాతినిధ్యం వహించేలా ఈ 56 కార్పోరేషన్లు పనిచేస్తాయని స్పష్టం చేసింది. జిల్లాలకు ప్రాతినిధ్యం వహించేలా ప్రతి కార్పొరేషన్‌లోనూ 13 మంది డైరెక్టర్లను నియమిస్తామని పేర్కొంది. కొత్తగా ఏర్పాటు చేసిన 56 బీసీ కులాల కార్పొరేషన్ల పరిధిలో మిగతా ఉపకులాలకూ ప్రాతినిధ్యం వస్తుందని స్పష్టం చేసింది. ఏపీ సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం 2001 ప్రకారం బీసీ కులాల కార్పొరేషన్ల ఏర్పాటు చేస్తూ వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: ప్రారంభమైన బెజవాడ కనకదుర్గ ఫ్లైఓవర్‌

2.71 కోట్ల మందికి లబ్ధి 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన 16 నెలల వ్యవధిలోనే 2,71,37,253 మంది బీసీలకు రూ. 33,500 కోట్ల మేర లబ్ధి చేకూర్చింది. ఇంత భారీగా బీసీల కోసం ఖర్చు చేసిన ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు లేదు. బీసీలకు నామినేటెడ్‌ పదవులు, నామినేటెడ్‌ పోస్టుల్లో సగం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికే దక్కుతుంది. 

మరిన్ని వార్తలు