రేపట్నుంచి ‘సెట్స్‌’

9 Sep, 2020 04:52 IST|Sakshi

కోవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు

ప్రత్యేకంగా ఐసొలేషన్‌ గదులు కూడా సిద్ధం

విద్యార్థులు సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇవ్వాలి: విద్యాశాఖ మంత్రి సురేష్‌  

సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్‌ సహా వివిధ వృత్తి విద్యాకోర్సుల్లోప్రవేశాలకు గురువారం నుంచి ‘ఏపీ సెట్స్‌’ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కోవిడ్‌ నేపథ్యంలో అన్ని నిబంధనలు, జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షల నిర్వహణకు సన్నాహాలు చేసినందున తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. ఈనెల 10వ తేదీనుంచి వరుసగా ఏపీసెట్స్‌ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రి మంగళవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి, వైస్‌ చైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు.

ఐసెట్‌తో ఆరంభం...
► టీసీఎస్, ఏపీ ఆన్‌లైన్‌ సంయుక్తంగా ఆన్‌లైన్‌లో ఈ ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నాయి.
► ఈనెల 10వ తేదీ నుంచి ఐసెట్‌తో ఏపీ సెట్స్‌ పరీక్షలు ప్రారంభం అవుతాయి.
► ఐసెట్‌ 10, 11వ తేదీల్లో, ఈసెట్‌ 14న, ఎంసెట్‌ 17 నుంచి 25 వరకు, పీజీసెట్‌ 28న, ఎడ్‌సెట్, లాసెట్‌ అక్టోబర్‌ 1న, పీఈసెట్‌ అక్టోబర్‌ 2 నుంచి 5 వరకు ఉంటాయి. 
► సెట్‌ పరీక్షలకు సెంటర్లతో పాటు స్లాట్స్‌ను కూడా పెంచారు.

ఐసొలేషన్‌ గదులు కూడా..
► ప్రతి పరీక్ష కేంద్రాన్ని ముందుగానే శానిటైజ్‌ చేసి సిబ్బందికి కిట్స్‌ అందిస్తారు. మాస్కులు, గ్లౌజ్‌లు, స్ప్రేయింగ్‌ మిషన్లు, థర్మల్‌ స్క్రీనింగ్‌ మిషన్లను ప్రభుత్వం సిద్ధం చేసింది.
► ప్రతి సెంటర్‌లో ఐసొలేషన్‌ గదులు . టెంపరేచర్‌ నిర్ణీత పరిమాణం కన్నా ఎక్కువగా ఉన్న వారికి ఆ గదుల్లో పరీక్షలు నిర్వహిస్తారు.
► ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు, మానిటరింగ్‌ డెస్కులు ఏర్పాటు.
► విద్యార్థులకు బార్‌కోడ్‌ హాల్‌ టికెట్లు జారీ చేసి సూచనలు, రోడ్‌ మ్యాపులను పొందుపరుస్తున్నారు.
► విద్యార్థులకోసం హెల్ప్‌లైన్‌ డెస్కు, ఫోన్‌ నంబర్లు అందుబాటులోకి.
► ప్రతి అభ్యర్థి కోవిడ్‌ 19పై డిక్లరేషన్‌ సమర్పించాలి.మాస్కులు, గ్లౌజ్‌లు తప్పనిసరిగా ధరించాలి.

మరిన్ని వార్తలు