మంత్రివర్గ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పేర్ని నాని
అమరావతి: 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం అమలు చేయనున్న సంక్షేమ పథకాల క్యాలండర్ను మంగళవారం ఏపీ మంత్రివర్గం ఆమోదించిందని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. చెప్పాడంటే చేస్తాడంతే అని పేరు సీఎం జగన్ పేరు తెచ్చుకున్నారని తెలిపారు. ఏ నెలలో ఏ పథకం అమలవుతుందనే అంశాన్ని తెలిపేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు చెప్పారు. మంత్రివర్గ సమావేశ నిర్ణయాలపై మంత్రి బుధవారం మీడియాకు వివరించారు.
దుర్గ గుడిలో అవినీతి నిరోధక శాఖ దాడులు చేస్తే రాష్ట్ర మంత్రి వెల్లంపల్లిపై ఆరోపణలు చేయడం శోచనీయమని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. అక్రమాలు సహించమని మా ప్రభుత్వం చెబుతున్నామని.. తనిఖీలు కూడా మేమే చేయిస్తుంటే రాజకీయ ఆరోపణలు చేయడం దారుణమని మండిపడ్డారు. వెల్లంపల్లిపై దారుణమైన ఆరోపణలు మానుకోవాలని ప్రతిపక్షాలకు హితవు పలికారు. గతంలో ఓ చీఫ్ ఇంజినీర్పై ఏసీబీ దాడులు చేస్తే అప్పటి మంత్రికి వాటిని అంటగట్టామా అని ప్రశ్నించారు. రాజకీయంగా ఎదుర్కోలేక పార్టీలు చేస్తున్న ఆరోపణలు ఇవి అని మంత్రి పేర్ని నాని కొట్టిపారేశారు. ఈ సందర్భంగా మంత్రివర్గం ఆమోదించిన సంక్షేమ క్యాలెండర్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.