దివ్యాంగులకు ‘ప్రత్యేకం’

25 Mar, 2021 03:25 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఉచితంగా ప్రత్యేక వాహనాలు అందించనున్న రాష్ట్ర ప్రభుత్వం

విద్య, ఉపాధికి దోహదపడేలా రూపకల్పన

సాక్షి, అమరావతి: సమాజంలో దివ్యాంగులకు మిగతా వారితో సమానావకాశాలు కల్పించడంలో భాగంగా వారికి ప్రత్యేక వాహనాలను ఉచితంగా సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వారి విద్య, ఉపాధికి దోహదపడేలా రూపొందించిన ఈ వాహనాల కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవాలని మహిళ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్‌ అనురాధ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇవీ అర్హతలు
► వార్షికాదాయం మూడు లక్షల్లోపు కలిగి, 18 – 45 మధ్య వయసు ఉండాలి. 70 శాతం, ఆ పైగా వైకల్యం ఉండాలి. గ్రాడ్యుయేషన్, ఆ పై చదువులు చదివే విద్యార్థులు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలతో సహా స్వయం ఉపాధి లేదా పదో తరగతి ఉత్తీర్ణతతో కనీసం ఏడాది నుంచి పని చేస్తున్న దివ్యాంగులకు వీటి ని ఇస్తారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలి. లేదా ప్రత్యేక వాహనం పొందడానికి ఎంపికైన దివ్యాంగులు రెండు నెలల్లోగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందాలి. 
► జిల్లా యూనిట్‌గా అర్హులైన వికలాంగులను జాయింట్‌ కలెక్టర్‌ అధ్యక్షతన గల కమిటీ ఎంపిక చేస్తుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లతో పాటు 50 శాతం మహిళలకు రిజర్వేషన్‌ కల్పిస్తారు. తొలుత వికలాంగులైన మహిళలకు ప్రాధాన్యం ఇస్తారు. తర్వాత పురుషులను ఎంపిక చేస్తారు. అర్హులైన దివ్యాంగులు ఏ జిల్లా నుంచి అయినా దరఖాస్తు చేసుకోవచ్చు.  

మరిన్ని వార్తలు