మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌

21 Mar, 2023 08:05 IST|Sakshi

 చైల్డ్‌ కేర్‌ లీవ్‌ను సర్వీస్‌లో ఎప్పుడైనా వాడుకోవచ్చు

ప్రైవేట్‌ స్కూళ్ల రెన్యువల్‌ మూడేళ్ల నుంచి 8 ఏళ్లకు పెంపు

టీచర్‌ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీల వినతికి సానుకూలంగా స్పందించిన సీఎం

సాక్షి, అమరావతి: ప్రభుత్వ మహిళా ఉద్యోగులు 180 రోజుల చైల్డ్‌ కేర్‌ లీవ్‌ను తమ సర్వీస్‌ కాలంలో ఎప్పుడైనా ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ ఆమో­దం తెలిపారు. ప్రస్తుతం ఈ చైల్డ్‌ కేర్‌ లీవ్‌ను పిల్లలకు 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు మాత్రమే ఉపయోగించుకోవా­లని నిబంధన ఉంది. దీనిని సవరించి.. మహిళా ఉద్యోగులకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

ఉపాధ్యాయ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఎంవీ రామచంద్రారెడ్డి, పర్వ­త­రెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్పలత సోమవారం అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో సీఎం జగన్‌ను కలి­శారు. ఈ సందర్భంగా వారు ఉపాధ్యాయుల సమస్యలపై సీఎంకు విజ్ఞాపన పత్రం అందజేశారు. మహిళా ఉద్యోగుల చైల్డ్‌ కేర్‌ లీవ్‌ సమస్యను సీఎం దృష్టికి తీసుకురాగా.. ఆయన సానుకూలంగా స్పందించి వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన టీచర్‌ ఎమ్మెల్సీలు చంద్రశేఖర్‌రెడ్డి, రామచంద్రారెడ్డి 

అలాగే ప్రైవేటు స్కూళ్ల రెన్యువల్‌ ఆఫ్‌ రికగ్నైజేషన్‌ను 3 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలకు పెంచాలని కోరగా.. దీనిపైనా సాను­కూలంగా స్పందించిన సీఎం ఆ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలని అధి­కారులను ఆదేశించారు. అనంతరం ఎంవీ రామచంద్రారెడ్డి మా­ట్లా­డుతూ.. తాము కోరిన వెంటనే సీఎం జగన్‌ మహిళా ఉద్యోగులకు మేలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారంటూ సంతోషం వ్యక్తం చేశారు.
 

మరిన్ని వార్తలు