కోవిడ్‌ కట్టడిలో ప్రభుత్వ చర్యలు భేష్‌

25 Aug, 2020 03:16 IST|Sakshi

మహమ్మారిని దీటుగా ఎదుర్కొంటోంది

దేశంలోనే మెరుగైన వైద్యం ఏపీలో మాత్రమే అందుతోంది

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బూసిరెడ్డి 

లబ్బీపేట (విజయవాడ తూర్పు): కోవిడ్‌ను రాష్ట్ర ప్రభుత్వం దీటుగా ఎదుర్కొంటోందని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి అన్నారు. కోవిడ్‌ కట్టడిలో ఏ రాష్ట్రం చేపట్టని విధంగా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. దేశంలోనే అత్యధిక కరోనా నిర్ధారణ పరీక్షలను రాష్ట్రంలోనే చేస్తున్నారని తెలిపారు. రోగులకు చికిత్స అందించడంలో ప్రభుత్వ చర్యలు చాలా బాగున్నాయని ప్రశంసించారు. దేశంలోనే మెరుగైన వైద్యం రాష్ట్రంలో మాత్రమే అందుతోందని కుండబద్దలు కొట్టారు. కరోనా కష్టకాలంలోనూ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ కింద ఉన్న ఆస్పత్రులను ప్రభుత్వం ఆదుకుందని చెప్పారు. గతంలో బకాయిలు నెలల తరబడి రాక చాలా ఇబ్బందులు పడేవాళ్లమని.. ఇప్పుడు ప్రభుత్వం బకాయిలను కేవలం రెండు వారాల్లోనే చెల్లిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోకపోతే సిబ్బందికి జీతాలివ్వడానికి కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేదన్నారు. అన్ని విధాలా తమకు సహకారమందిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. సోమవారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ నరేంద్రరెడ్డి ఏమన్నారంటే..

కోవిడ్‌ సేవలు అందించేందుకు సిద్ధం
► కరోనాపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత మాపై ఉంది.
► రాష్ట్రంలోని 560 ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో కోవిడ్‌ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. 
► ఏ జిల్లాలో ఎలాంటి సాయం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. 
► ప్రతి కోవిడ్‌ ఆస్పత్రిలో ఎన్ని పడకలు ఉన్నాయనే సమాచారం ఆన్‌లైన్‌లో కూడా ఉంది. 
► ప్రతి ఆస్పత్రికి ప్రభుత్వం ఒక నోడల్‌ అధికారిని నియమించడంతోపాటు వలంటీర్‌ల ద్వారా రోగుల సమాచారాన్ని వారి బంధువులకు తెలియజేస్తోంది. 
► ఆస్పత్రిల్లో బెడ్‌లు, వైద్యం అందవనే అనుమానాలు వద్దు. 
► ప్రతి జిల్లాలో కలెక్టర్ల ద్వారానే ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ అడ్మిషన్‌లు జరుగుతున్నాయి.
► కరోనా వైరస్‌ నిర్ధారణకు సీటీ స్కాన్‌ ప్రామాణికం కాదు.  
► ఒక ప్రణాళిక ప్రకారం రాష్ట్రంలో కోవిడ్‌ రోగులకు చికిత్స అందిçస్తున్నారు.
► రాష్ట్రంలోనే మరణాల రేటు చాలా తక్కువగా ఉంది.    
► ప్రజలు కోవిడ్‌ గురించి భయపడకుండా అవగాహన పెంచుకోవాలి. 
► స్వల్ప లక్షణాలు ఉంటే ఇంట్లోనే ఉండి చికిత్స పొందొచ్చు. మధ్యస్థ స్థాయిలో లక్షణాలు ఉంటే కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ఉండాలి. లక్షణాలు తీవ్రంగా ఉంటే ఆస్పత్రిలో చేరాలి.  
► ఈ సమావేశంలో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల అసోసియేషన్‌ ప్రతినిధులు డాక్టర్‌ రమేశ్, డాక్టర్‌ ఎ.వినయ్, డాక్టర్‌ నరేశ్, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు