‘ఎవరిని ప్రశ్నించినా అంతా చైర్మన్‌కే తెలుసంటున్నారు’

27 Apr, 2021 17:24 IST|Sakshi

సాక్షి, అమరావతి: సంగం డెయిరీ కార్యాలయాల్లో విచారణ నిమిత్తం ఇంకా సోదాలు నిర్వహించాలని అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ పేర్కొన్నారు. చాలా మంది సాక్షులను విచారించి, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవాలని ఆయన తెలిపారు. సంగం డెయిరీ అక్రమాల కేసులో అరెస్టు అయిన తెలుగుదేశం నేత ధూళిపాళ్ల నరేంద్ర దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్‌ తమ వాదనలు వినిపించారు. సంగం డెయిరీలో అక్రమాల గురించి ఎవరిని ప్రశ్నించినా అంతా చైర్మన్‌కే తెలుసు అంటున్నారని,  ఏ1 ముద్దాయి ధూళిపాళ్ల నరేంద్ర జైల్లో ఉంటేనే ఇది సాధ్యమవుతుందని కోర్టుకు తెలిపారు.

ధూళిపాళ్ల నరేంద్రను కస్టడీకి ఇవ్వమని కోర్టులో ఏసీబీ పిటిషన్ దాఖలు చేసిందని, ఈ సందర్భంలో రిమాండ్ కొట్టివేస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతుందన్నారు. సంగం డైయిరీ లో 74 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, ప్రభుత్వం యాజమాన్యాన్ని మార్చిదే తప్పా.. భూమిపై హక్కులు వదులుకోలేదని అన్నారు. ధూళిపాళ్ల నరేంద్ర దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేయాలని హైకోర్టుకు విన్నపించారు.

కాగా  2010 నుంచి ధూళిపాళ్ల నరేంద్ర సంగం డెయిరీకి ఛైర్మన్‌గా ఉన్నారు. సంగం డైయిరీలో అవినీతి, అక్రమాలు జరిగాయని ఆయనను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ధూళిపాళ్లతోపాటు సంగం డెయిరీలో ఎండీ గోపాలకృష్ణ, ప్రకాశం జిల్లా సహకార శాఖలో రిజిస్ట్రార్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన మేళం గురునాథంను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. వీరిని విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చగా కోర్టు పూర్తి అదనపు ఇన్‌చార్జి న్యాయమూర్తి వి.శ్రీనివాస ఆంజనేయమూర్తి ముగ్గురికి 14 రోజుల రిమాండ్‌ విధించారు. 

చదవండి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల అరెస్ట్‌

మరిన్ని వార్తలు