రాష్ట్రంలో కరోనా పీక్‌ స్టేజ్‌కు వెళ్లి తగ్గింది: అనిల్‌ కుమార్‌

29 May, 2021 19:24 IST|Sakshi

బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు కేంద్రమే ఇంజెక్షన్లను కేటాయిస్తోంది

రాష్ట్రంలో ఆక్సిజన్‌ వినియోగం గణనీయంగా తగ్గింది

వ్యాక్సినేషన్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు: అనిల్‌ కుమార్‌ సింఘాల్‌

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కర్వ్‌ 25.56 శాతం మేర పీక్ స్టేజీకి వెళ్లి.. ప్రస్తుతం 17 శాతానికి తగ్గింది.. యాక్టీవ్ కేసులు 2.11 లక్షలకు వెళ్లి.. ప్రస్తుతం 1.74 లక్షలకు దిగాయి అని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. అన్ని జిల్లాల్లో కరోనా కేసులు తగ్గాయి.. మేం చేస్తోన్న వారపు సమీక్షలో కూడా తగ్గుదల కన్పిస్తోంది అన్నారు.

ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘బ్లాక్ ఫంగస్ కేసుల చికిత్సకు అవసరమైన ఇంజక్షన్లను కేంద్రమే కేటాయిస్తోంది. కేంద్రం నుంచి 7,725 యాంఫోటెరిసిన్-బీ ఇంజక్షన్లు వచ్చాయి. పొసాకొనోజోల్ ఇంజక్షన్లు 1,250 వచ్చాయి.. మరో 50 వేల ఇంజక్షన్లు ఆర్డర్ ఇచ్చాం. పొసాకొనోజోల్ టాబ్లెట్స్ వచ్చిన మేరకు జిల్లాలకు కేటాయిస్తున్నాం’’ అన్నారు. 

‘‘గత ఐదు రోజులుగా ఆక్సిజన్ వినియోగం గణనీయంగా తగ్గింది. గతంలో పీక్ స్టేజీలో 640 టన్నుల ఆక్సిజన్ వినియోగించాం. ప్రస్తుతం ఆక్సిజన్ వినియోగం 510 టన్నులకు తగ్గింది. ప్రభుత్వాస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా ఆక్సిజన్ ప్లాంట్ పెట్టాల్సిందే. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే సబ్సిడీ ఇస్తాం.. విద్యుత్ రాయితీలు అందిస్తాం’’ అని అనిల్‌ కుమార్‌ తెలిపారు. 

‘‘రాష్ట్ర వ్యాప్తంగా 66 ఆస్పత్రులపై విజిలెన్స్ విభాగం నుంచి ఫిర్యాదులు వచ్చాయి. వీటిల్లో ఇప్పటికే చాలా ఆస్పత్రులకు పెనాల్టీ విధించాం. అలాగే వైద్యారోగ్య శాఖలో నమోదైన కేసులు వేరేగా ఉన్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స తీసుకుని చనిపోయినా సరే అనాథలైన పిల్లలకు రూ. 10 లక్షలు ఫిక్సిడ్ డిపాజిట్ చేస్తాం. వ్యాక్సినేషన్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయి’’ అని అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ హెచ్చరించారు. 

చదవండి: జిల్లాలకు 3 వేల బ్లాక్‌ ఫంగస్‌ ఇంజక్షన్లు

మరిన్ని వార్తలు