జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏపీ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

16 Sep, 2021 11:40 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏపీ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సింగిల్‌ బెంచ్‌ తీర్పును హైకోర్టు కొట్టేసింది. కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహించుకోవచ్చని డివిజన్‌ బెంచ్‌ తెలిపింది. గురువారం ఉదయం  ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను హైకోర్టు సమర్థించింది.

ఈ ఏడాది ఏప్రిల్‌ 8న 515 జెడ్పీటీసీ, 7220 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 10న కౌంటింగ్ నిర్వహించాల్సి ఉండగా హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులతో వాయిదా పడింది. మొదటి నుంచి ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీచేసింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై  హైకోర్టు డివిజన్ బెంచ్‌ని ఎస్‌ఈసీ ఆశ్రయించింది. డివిజన్ బెంచ్ ఉత్తర్వుల మేరకే జడ్పీటీసి, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించామని ఎస్‌ఈసీ తెలిపింది. మళ్లీ ఎన్నికలు నిర్వహించడం ఈ పరిస్థితులలో అసాధ్యంతో పాటు కోట్లాది రూపాయిలు వృధా అవుతాయని ఎస్‌ఈసీ పేర్కొంది. నేడు హైకోర్టు.. కౌంటింగ్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో న్యాయ పరమైన చిక్కులు తొలిగాయి. దీంతో కౌంటింగ్ ప్రక్రియకు ఎస్‌ఈసీ కసరత్తు ప్రారంభించింది.

చదవండి: సైదాబాద్‌ చిన్నారి కేసు: నిందితుడు రాజు ఆత్మహత్య!
సీఎం జగన్‌ లేఖపై తక్షణం స్పందించిన విదేశాంగ శాఖ 

మరిన్ని వార్తలు