పిల్‌ కాకుండా రిట్‌ ఏంటండి?.. కేఏ పాల్‌ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి

6 Jan, 2023 08:48 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రోడ్‌షోలు, బహిరంగ సభలపై నిషేధం విధించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్‌ దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం లేవనెత్తింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) రూపంలో కాకుండా రిట్‌ పిటిషన్‌ రూపంలో పిటిషన్‌ దాఖలు చేయడంపై అభ్యంతరం తెలిపింది. దీనిపై.. 

తగిన నిర్ణయం తీసుకునేందుకు ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి ముందుంచింది. రోస్టర్‌ ప్రకారం ఈ వ్యాజ్యం గురువారం న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావు వద్దకు వచ్చింది. ఇది ప్రజల విస్తృత ప్రయోజనాల కోసం కదా. అలాంటప్పుడు ఈ వ్యాజ్యాన్ని పిల్‌ రూపంలో దాఖలు చేయాలి కదా! అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అయినా పిటిషనర్‌ గతంలో తన క్లయింట్‌ అయినందువల్ల ఈ వ్యాజ్యాన్ని తాను విచారించలేనని స్పష్టం చేశారు. 

ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు వచ్చేలా రిజిస్ట్రీకి ఆదేశాలివ్వాలని పాల్‌ న్యాయవాది ఎంవీ రాజారాం కోరగా.. ఆ పని తాను చేయలేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అత్యవసరం ఉందని పిటిషనర్‌ తరపు న్యాయవాది చెబుతున్నారంటూ ఉత్తర్వుల్లో ప్రస్తావించారు.

మరిన్ని వార్తలు