‘సంగం’ కేసులో దర్యాప్తు నిలుపుదలకు హైకోర్టు నో

8 May, 2021 04:58 IST|Sakshi

ఏసీబీ కోర్టుకు హైకోర్టు ఆదేశం

సాక్షి, అమరావతి: సంగం డెయిరీ అక్రమాలపై ఏసీబీ చేపట్టిన దర్యాప్తు ప్రక్రియను నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. అయితే, సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకుమార్, ఆ కంపెనీ ఎండీ గోపాలకృష్ణన్‌ కస్టడీ విషయంలో చట్ట నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని విజయవాడ అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక కోర్టును శుక్రవారం ఆదేశించింది. దర్యాప్తు ప్రక్రియపై అభ్యంతరం ఉంటే ఆ విషయాన్ని ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకురావొచ్చని తెలిపింది. కంపెనీకి సంబంధించిన వ్యాపార వివరాలు, పాల ఉత్పత్తిదారుల వివరాలు కంపెనీ ప్రాంగణం దాటి బయటకు వెళ్లకూడదని దర్యాప్తు అధికారులకు స్పష్టం చేసింది.

కంపెనీ ప్రయోజనాలకు నష్టం వాటిల్లే చర్యలు చేపట్టవద్దంది. ఏ రోజు చేసిన దర్యాప్తు వివరాలు ఆ రోజు కంపెనీ ప్రతినిధుల సమక్షంలో పంచనామా రూపంలో రికార్డ్‌ చేయాలని దర్యాప్తు అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను జూన్‌ 17కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏసీబీ అధికారులు తమపై నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ ధూళిపాళ్ల నరేంద్ర హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ రఘునందన్‌రావు శుక్రవారం మరోసారి విచారణ జరిపారు.  

మరిన్ని వార్తలు