‘ఏపీ ఐసెట్‌’ ఫలితాలు విడుదల

26 Sep, 2020 03:52 IST|Sakshi
ఐసెట్‌ కీ విడుదల చేస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఏపీ స్టేట్‌ కౌన్సిల్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ చైర్మన్‌ హేమచంద్రారెడ్డి

తిరుపతి వాసికి మొదటి ర్యాంకు 

78.65 శాతం మంది క్వాలిఫై 

30 నుంచి ర్యాంకు కార్డుల డౌన్‌లోడ్‌ 

సాక్షి, అమరావతి: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్‌ 2020 పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ శుక్రవారం  విడుదల చేశారు. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ ఫలితాలను ప్రకటించారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి, ఐసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఎం.శ్రీనివాసరెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు.  ఏపీ ఐసెట్‌ ఫలితాల్లో తిరుపతికి చెందిన డి.ఫణిత్‌ మొదటి ర్యాంకు సాధించాడు. కోవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ ఏపీ ఎంసెట్‌ పరీక్షను ఈనెల 17వతేదీ నుంచి 25 వరకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా  నిర్వహించామని మంత్రి సురేష్‌ చెప్పారు. ఇందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.  

► ఈనెల 10, 11వ తేదీల్లో నిర్వహించిన ఏపీ ఐసెట్‌ పరీక్షలకు 64,884 మంది దరఖాస్తు చేయగా 51,991 మంది హాజరయ్యారు. పరీక్షల్లో 40,890 మంది (78.65 శాతం) అర్హత సాధించారు. మొత్తం 45 నగరాల్లో 75 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. 
► ఎంబీఏ కోర్సును 352 కాలేజీలు అందిస్తుండగా ఎంసీఏ కోర్సును 130 కాలేజీలు నిర్వహిస్తున్నాయి.  
► ఎంబీఏలో 44084 సీట్లు, ఎంసీఏలో 8,558 సీట్లు ఉన్నాయి. ఇందులో కన్వీనర్‌ కోటాలో ఎంబీఏలో 31368 సీట్లు, ఎంసీఏలో 6,229 సీట్లు భర్తీ చేయనున్నారు. మిగతావి మేనేజ్‌మెంట్‌ తదితర విభాగాల్లో భర్తీ కానున్నాయి.  
► ఈసారి ఐసెట్‌ను శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం నిర్వహించింది. గతేడాది కంటే  ఈసారి పరీక్షకు అభ్యర్థుల సంఖ్య పెరిగింది.

అర్హుల కంటే సీట్లే అధికం
యూనివర్సిటీ క్యాంపస్‌(తిరుపతి):  ఎస్వీయూ ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతున్న డి.ఫణిత్‌ నవంబర్‌లో జరిగే క్యాట్‌ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతూ ఐసెట్‌లో ఫస్ట్‌ ర్యాంకు సాధించాడు. 
► ఈ నెల 30 నుంచి ర్యాంకు కార్డులను  డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఐసెట్‌ కన్వీనర్‌ శ్రీనివాసరెడ్డి తెలిపారు.  ఈసారి అర్హత సాధించిన వారి కన్నా 11,752 సీట్లు ఎక్కువగా ఉండటం విశేషం. 

మరిన్ని వార్తలు