దేశవ్యాప్తంగా ఏపీ ‘పెట్టుబడుల’ సదస్సులు

3 Feb, 2023 08:28 IST|Sakshi
(ఫైల్‌ ఫోటో)

ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, కోల్‌కతా, త్రివేండ్రం, చెన్నై,   హైదరాబాద్‌లో నిర్వహణ 

సాక్షి, అమరావతి: పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా విశాఖలో మార్చి నెలలో జరిగే గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సును విజయవంతం చేయడమే లక్ష్యంగా.. దేశవ్యాప్తంగా పెట్టుబడుల సన్నాహక సదస్సులను ఏపీ ప్రభుత్వం నిర్వహించబోతోంది. ఫిబ్రవరి 10 నుంచి 24 వరకు దేశంలోని 7 ప్రధాన నగరాల్లో రోడ్‌షోలు నిర్వహించేందుకు ఏపీ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు ప్రణాళికలు రూపొందించింది. సీఎం జగన్‌ ఇటీవల ఢిల్లీలో ప్రారంభించిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సన్నాహక సదస్సు విజయవంతమవ్వడంతో.. అదే స్ఫూర్తితో ఈ రోడ్‌షోలను కూ డా నిర్వహించబోతోంది. 

ఫిబ్రవరి 10న త్రివేండ్రం, కోల్‌కతా, 14న బెంగళూరులో, 17న చెన్నై, అహ్మదాబాద్, 21న ముంబై, 24వ తేదీన హైదరాబాద్‌లో ఈ రోడ్‌షోలు నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశమున్న వనరులు, ప్రయోజనాలను వివరించడంతో పాటు ప్ర ధానంగా 13 రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఈ రోడ్‌ షోలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి పలు సంస్థలు ఇప్పటికే ఆసక్తిని వ్యక్తం చేశాయి. మార్చి 3–4 తేదీల్లో విశాఖ వేదికగా జరిగే గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సులో ఆ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడు లు పెడుతూ.. వాస్తవ ఒప్పందాలు చేసుకుంటా యని పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు.  

మరిన్ని వార్తలు