పోలవరం ప్రాజెక్ట్ డిజైన్ల ఖరారుపై కేంద్ర జల్‌శక్తి శాఖ సమావేశం

17 May, 2022 13:55 IST|Sakshi

న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్ట్ డిజైన్ల ఖరారుపై మంగళవారం మధ్యాహ్నం.3 గంటలకు జల్‌శక్తి శాఖలో సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర జల్‌శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది. నిధుల మంజూరుపై రేపు ఆ శాఖ కార్యదర్శి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయనున్నారు. గోదావరి వరద ఉధృతికి పోలవరం ప్రధాన డ్యామ్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చటం, కొంత భాగం దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్‌ను పటిష్ఠం చేయడంపై చర్చించేందుకు సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.

కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్‌ (డీడీఆర్పీ), పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అధికారులతోపాటు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈనెల 11న సీడబ్ల్యూసీ డైరెక్టర్‌ ఖయ్యూం అహ్మద్‌ నేతృత్వంలోని అధికారుల బృందం పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధ్యయనం చేసింది.

మరిన్ని వార్తలు