పోర్టు ఆధారిత విదేశీ పెట్టుబడులే లక్ష్యం

12 Dec, 2022 10:55 IST|Sakshi

విశాఖ సదస్సు సందర్భంగా ప్రణాళిక సిద్ధం చేసిన ఏపీ మారిటైమ్‌ బోర్డు  

సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం వీటి ఆధారంగా పరిశ్రమలను తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది. వచ్చే ఏడాది విశాఖ వేదికగా జరిగే అంతర్జాతీయ పెట్టుబ­డుల సదస్సులో పోర్టు ఆధారిత విదేశీ పెట్టుబ­డులను ఆకర్షించే విధంగా ఏపీ మారిటైమ్‌ బోర్డు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ సదస్సులో పరిశ్రమలు, ఇంధన రంగం తర్వాత పోర్టు ఆధారిత రంగంలో పెట్టుబడులు అధికంగా వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కార్గో టెర్మి­నల్స్, లాజిస్టిక్స్‌ పార్క్, ఐసీడీ, వేర్‌ హౌసింగ్‌ తదితరాల్లో పెట్టుబడులు పెట్టేందుకున్న అవకాశాల గురించి అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయాలని భావిస్తున్నారు. యూఏఈ, జపాన్‌ తదితర దేశాల్లో రోడ్‌షోలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు మారి­టైమ్‌ బోర్డు అధికారులు వెల్లడించారు. కొత్తగా నిర్మిస్తున్న 4 పోర్టుల్లో ఉన్న పెట్టుబడి అవకా­శాలు.. ఈ పోర్టుల పక్కనే అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక పార్కులు, వాటిలో మౌలిక వస­తుల కల్పన తదితరాలను కూడా వివరించను­న్నట్లు తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభు­త్వం సముద్ర ఆధారిత వాణిజ్యానికి ఇస్తున్న ప్రాధాన్యం, పెట్టుబడి అవకాశాలను వివరిస్తూ జనవరిలో విశాఖ వేదికగా అంతర్జాతీయ మారి­టైమ్‌ సదస్సును నిర్వహించనున్నట్లు అధికా­రులు తెలిపారు. అలాగే గుంటూరు వేదికగా సము­ద్రపు ఆహార ఉత్పత్తులు, వాటి రంగంలో పెట్టుబడుల అవకాశాలపై సదస్సు నిర్వహించడానికి ఏపీ మారిటైమ్‌ బోర్డు కసరత్తు చేస్తోంది.

మరిన్ని వార్తలు