పెట్రో కెమికల్ కారిడార్‌తో 50 లక్షల మందికి ఉపాధి అవకాశాలు: మేకపాటి

16 Jun, 2021 18:59 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రో కెమికల్‌ కారిడార్‌ ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగా ఉందని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి పేర్కొన్నారు. 25వేల కోట్ల రూపాయలతో పెట్రో కెమికల్‌ కారిడార్‌ రూపొందించనున్నట్లు వెల్లడించారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్‌తో సుమారు 50 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు తెలిపారు.రానున్న 2, 3 ఏళ్లల్లో పెట్రో కెమికల్ రంగంలోకి భారీగా పెట్టుబడులు రాబోతున్నట్లు వెల్లడించారు. ఈస్ట్‌కోస్ట్‌ కారిడార్‌లో రూ.30వేల కోట్ల వరకు పెట్టుబడులు రానున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ఇథనాల్‌ రంగంలోకి మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు పేర్కొన్నారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే అనుబంధ పరిశ్రమలు కలుపుకొని మరో 2 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశం ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పెట్రో కెమికల్ ప్రాజెక్టు పూర్తికి కేంద్రం నుంచి పూర్తి సహకారానికి అంగీకారం తెలిపేలా చేస్తామన్నారు. ఇటీవల పెట్రోల్‌లో ఇథనాల్ వినియోగం 10 శాతం నుంచి 20 శాతానికి కేంద్ర ప్రభుత్వం పెంచిందన్నారు. తద్వారా రాబోయే రోజుల్లో ఇథనాల్ రంగంలో మరిన్ని  పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంటున్నారు. రాష్ట్రంలో చక్కెర మిల్లుల నుంచి విడుదలయ్యే మొలాసిస్‌ నుంచి ఇథనాల్ తయారుచేయవచ్చని, చక్కెర మిల్లులు ప్రత్యేకంగా ఈ ప్లాంట్లను నెలకొల్పడానికి పెట్టుబడులు కావాలన్నారు. దేశవ్యాప్తంగా ఇథనాల్ ఉత్పత్తి పెంచే చర్యల్లో భాగంగా రూ. 1,000 కోట్లు కేంద్రం ఇవ్వనుందని తెలిపారు.

‘పెట్రో కెమికల్ కాంప్లెక్స్ గురించి ప్రాజెక్టు రిపోర్ట్ ప్రజంటేషన్ ఇవ్వడం జరిగింది. వయోబిలిటీ గ్యాప్ ఫండింగ్ పైనా కేంద్ర, రాష్ట్ర కార్యదర్శులు ప్రణాళిక సిద్ధం చేయడానికి దిశానిర్దేశం. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో చర్యలు. ఆ తర్వాత కేంద్రం ఆమోదంతో ప్రాజెక్టు పనులు మొదలు. అదే జరిగితే ప్రైవేటు పెట్టుబడులు కూడా అనేకం వస్తాయి. అభివృద్ధి, పెట్టుబడులకు సంబంధించి ఎంవోయూల గురించి చెప్పలేదు. కేవలం గ్రౌండ్ అయినవి మాత్రమే ఓపెన్‌గా ప్రకటించాం. రాష్ట్రంలో రూ. 30 వేల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అవడమే కాకుండా, మరో రూ.16వేల కోట్లు ఎస్ఐపీసీలో క్లియర్ అయ్యాయి. ఎస్ఐపీబీ అనంతరం వీటిపై కూడా పూర్తి క్లారిటీ. కోవిడ్ విపత్తులోనూ 45,000 ఉపాధి అవకాశాలు సృష్టించడం చిన్న విషయం కాదు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రౌండ్ అయిన ప్రాజెక్టుల గురించి అది కూడా 2019 నుంచి గ్రౌండ్ అయినవే చెప్పాం’. అని తెలిపారు.

చదవండి: సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన లేళ్ల అప్పిరెడ్డి
ఏపీ: గ్రూప్‌-1 ఇంటర్వ్యూలపై హైకోర్టు స్టే

>
మరిన్ని వార్తలు