సంక్షేమం..అభివృద్ధే గెలిపించాయి..‌

15 Mar, 2021 16:48 IST|Sakshi

తాడేపల్లి: ప్రజల కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీసుకొచ్చిన పథకాలు, చేసిన అభివృద్ధి మున్సిపల్‌ ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిపించాయని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ అన్నారు. ఈ మేరకు సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం విద్యావ్యవస్థలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టిందని అన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందాలనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీ పరిధిని, 108, 104 సేవలను కూడా పెంచామన్నారు. కొత్తగా మరో 16 మెడికల్‌ కాలేజీలు తీసుకొస్తున్నట్లు తెలిపారు. నూతనంగా, 3 పోర్టులు, 4 షిప్పింగ్‌ హర్బర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోలవరం, రాయలసీమ డ్రాట్‌ మిటిగేషన్‌ వంటి ఇరిగేషన్‌ ప్రాజెక్టులను తీసుకొచ్చామన్నారు.

తమ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయానికి కట్టుబడి ఉందన్నారు. మాట మాట్లాడితే 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు ప్రజలు చెంప చెళ్లుమనిపించేలా బుద్ధి చెప్పారన్నారు. అధికార పార్టీని ఏం పీకుతారు అన్న బాబుకి , ప్రజలే డిపాజిట్లు కూడా లేకుండా జెండా పీకేశారని విమర్షించారు. 2019 అసెంబ్లి ఎన్నికల్లో ప్రజలు బాబుని పీకేశారు. ఇక 2024లో టీడీపీ జెండాను కూడా పీకి పడేస్తారని అన్నారు. అయితే తమకు ఇంత భారీ మెజార్టీనిచ్చిన ప్రజలకు తమ ప్రభుత్వం ఎప్పటికి  రుణపడి ఉంటుందని అన్నారు.

చదవండి: నిన్న వలంటీర్లు.. నేడు కౌన్సిలర్, కార్పొరేటర్లు

మరిన్ని వార్తలు