ఉత్తరాంధ్ర బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు టీడీపీ యత్నం: మంత్రి అమర్నాథ్‌

27 Oct, 2022 19:40 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం:  ఉత్తరాంధ్ర బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. అమరావతి యాత్ర క్యాపటలిస్టులు వెనక్కి వెళ్లారని, కానీ ఇంకా ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ నాయకుల్లో మార్పు రాలేదన‍్నారు. ఉత్తరాంధ్రకు ఏం కావాలో చెప్పాల్సింది పోయి అమరావతి కోసం పాకులాడుతున్నారని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో 22 సంవత్సరాలుగా ఉత్తరాంధ్రకు ఏం చేశారో  చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

‘రేపటి నుంచి టీడీపీ వారం రోజుల పాటు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఉత్తరాంధ్రపై విషం చిమ్మి అమరావతి వైపు పెట్టుబడులు వెళ్లేలా చేస్తున్నారు. ఎంతకాలం ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులు చంద్రబాబు బూట్లు నాకుతారు. ఉత్తరాంధ్ర అంటే గంజాయి సాగు జరుగుతుందని పంటలు పండవని టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. మేం అమరావతికి అడ్డు పడటం లేదు.. అమరావతితో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధి చేయాలని కోరుతున్నాం.  అది తప్పా? విశాఖ అభివృద్ధి చెందితే అమరావతి పెట్టుబడులకు నష్టం వస్తుందని చంద్రబాబు తాబేదార్ల భయం. విశాఖలో అన్ని రకాల సదుపాయాలున్నాయి. అమరావతి రైతులది వితండ వాదం.. భూములు ఇచ్చాం రాజధాని ఏర్పాటు చేయాలంటే ఎలా? త్యాగం అంటే పరిశ్రమల కోసం భూములు ఇచ్చిన రైతులది. మీ కోసం మీరు భూములు ఇవ్వడం స్వార్థం.’ అని పేర్కొన్నారు మంత్రి అమర్నాథ్‌. 

టీడీపీ హయాంలో రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి స్మగ్లింగ్, భూముల రికార్డ్ల ట్యాంపరింగ్‌ జరిగిందని అందరికీ తెలుసునన్నారు మంత్రి అమర్నాథ్‌. వెన్నుపోటు నాయకుని వెనుక ఉన్న నాయకులు అదే ఆలోచనతో ఉత్తరాంధ్రకు వెన్నుపోటు పొడుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష విశాఖ గర్జనలో కనిపించిందని గుర్తు చేశారు.

ఇదీ చదవండి: ఉద్దానంపై ప్రేమ కాదు.. ఉత్తరాంధ్రపై ఏడుపు.. ఈనాడు, టీడీపీపై మంత్రి మండిపాటు

మరిన్ని వార్తలు