ప్రేమికులపై దాడి: బాధితురాలికి రూ.5లక్షల పరిహారం

21 Jun, 2021 14:33 IST|Sakshi
ఏపీ మంత్రులు తానేటి వనిత , సుచరిత

బాధితురాలిని పరామర్శించిన మంత్రులు సుచరిత, తానేటి వనిత

సాక్షి, గుంటూరు: తాడేపల్లి పరిధిలోని సీతానగరంలో జరిగిన ప్రేమికులపై దాడి ఘటనలో గాయపడిని బాధితురాలిని గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ  క్రమంలో సోమవారం బాధితురాలిని ఏపీ మంత్రులు సుచరిత, తానేటి వనిత పరామర్శించారు. బాధితురాలికి ధైర్యం చెప్పి.. త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు. బాధితురాలికి ప్రభుత్వం తరఫున 5 లక్షల రూపాయల పరిహారం అందజేస్తున్నట్లు ప్రకటించారు. 

ఈ సందర్భంగా హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. ‘‘కృష్ణా తీరంలో జరిగిన ఘటన హేయమైన చర్య. నిందితులను పట్టుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాం. తప్పు చేసినవారు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తాం. ఇప్పటికే నాలుగు పోలీసు బృందాలను నియమించాం. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటాం. 15 లక్షల మంది ఇప్పటివరకు దిశ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్నారు. త్వరితగతిన దర్యాప్తు జరిగేలా భవిష్యత్‌లో మరిన్ని చర్యలు తీసుకుంటాం. మూడు చోట్ల ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం.. ఇప్పటికే ఈ ల్యాబుల్లో సిబ్బందిని నియామిస్తున్నాం. ఇలాంటివి జరగకుండా నిఘా, భద్రత ఏర్పాటు చేస్తున్నాం. ప్రత్యేకంగా ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం’’ అని తెలిపారు.

అనంతరం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ‘‘సీతానగరం ఘటన దురదృష్టకరం. బాధితురాలికి ప్రభుత్వం తరఫున రూ.5లక్షల పరిహారం.. స్త్రీ,శిశు సంక్షేమశాఖ నుంచి మరో రూ.50వేలు అందజేస్తాం. ఇద్దరు వ్యక్తులు నేరానికి పాల్పడినట్టు ప్రాథమికంగా తేలింది. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు జరుగుతోంది’’ అన్నారు. 

చదవండి: ప్రేమికులపై దాడి ఘటన: విచారణకు ప్రత్యేక పోలీస్ బృందాలు

మరిన్ని వార్తలు