ఇదే లాస్ట్‌ వార్నింగ్‌.. పనితీరు మార్చుకోండి

2 Aug, 2021 18:02 IST|Sakshi

సాక్షి, ఎస్‌.రాయవరం(విశాఖపట్నం): సర్వసిద్ధి పీహెచ్‌సీ సిబ్బంది పనితీరు మార్చుకోవాలని, విధులకు సక్రమంగా హాజరుకాకుంటే సహించేది లేదని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు హెచ్చరించారు. సర్వసిద్ధి గ్రామంలోని  ప్రైవేటు కార్యక్రమానికి ఆదివారం వచ్చిన ఆయన ఆకస్మికంగా స్థానిక పీహెచ్‌సీని సందర్శించారు. పీహెచ్‌సీలో డాక్టర్‌ లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 

సిబ్బంది ఎక్కడ ఉంటున్నారని ఆరా తీశారు. అటెండర్‌తో సహా ఎవరూ స్థానికంగా ఉండడం లేదని గ్రామస్తులు చెప్పడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా అందుబాటులోకి వచ్చిన  స్టాఫ్‌ నర్సు, అటెండర్‌తో మాట్లాడుతూ ఇదే లాస్ట్‌ వార్నింగ్‌ అని, ఇకపై పీహెచ్‌సీ ఇబ్బంది ఇలా చేస్తే క్షమించేది లేదన్నారు.   

రోడ్ల నిర్మాణానికి నిధులు 
గ్రామంలో ఎస్సీపేట వీధి రోడ్ల నిర్మాణానికి త్వరలో నిధులు కేటాయిస్తానని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు తెలిపారు. కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు ఆయన ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పంచాయతీకి మంజూరయ్యే నిధులను ఈ వీధిలోని రోడ్ల అభివృద్ధికి  కేటాయించాలని స్థానిక సర్పంచ్‌ గణేశ్వరరావుకు సూచించారు. ఎమ్మెల్యే వెంట  పాయకరావుపేట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మామిడి చంటి, వైఎస్సార్‌ సీపీ మండల శాఖ అధ్యక్షుడు కొణతాల శ్రీనివాసరావు తదితరులున్నారు.    

మరిన్ని వార్తలు