ఎన్నికలు జరగాల్సిన పంచాయతీలు 211 పోలింగ్ తేదీ 9
సాక్షి, కృష్ణా: పంచాయతీల ఎన్నికల్లో మరో అంకం పూర్తయింది. గురువారంతో నామినేషన్ల ఉపసంహరణ పక్రియ ముగిసింది. తొలిదశలో విజయవాడ డివిజన్లోని 14 మండలాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటికి ఈనెల జనవరి 29 నుంచి 31 వరకు నామినేషన్లను స్వీకరించారు. ఈ డివిజన్లో 234 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందులో 23 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 211 పంచాయతీలకు, వార్డులకు ఈనెల 9న ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో 6,93,822 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
కంకిపాడు (పెనమలూరు), రామవరప్పాడు: స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని మూడు గ్రామ పంచాయతీ సర్పంచిలు ఏకగ్రీవమయ్యాయి. రెండు గ్రామ పంచాయతీలు పూర్తిగా వార్డు సభ్యుల స్థానాలతో సహా ఏకగ్రీవం అయ్యాయి. నెప్పల్లి గ్రామ పంచాయతీ జనరల్ మహిళకు రిజర్వు కాగా నామినేషన్ల స్వీకరణ నాటికి మండవ ప్రగతి ఒక్కరే సర్పంచి అభ్యరి్థగా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆ స్థానం తొలుతే ఏకగ్రీవాల జాబితాలో చేరింది. అలాగే కాసరనేనివారిపాలెం, మద్దూరు గ్రామ సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే విజయవాడ రూరల్ ప్రసాదంపాడు సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. సర్నాల గంగారత్నం ఏకగ్రీవంగా ఎన్నికయ్యినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అలాగే ఇక్కడ మొత్తం 16 వార్డులకు గానూ 12 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.