30,19,296 టెస్టులు

20 Aug, 2020 05:01 IST|Sakshi

కోవిడ్‌ పరీక్షల్లో దేశంలో అగ్రస్థానంలో ఏపీ 

రాష్ట్రంలో మృతుల శాతం అత్యల్పం 

మొదటి లక్ష టెస్టులకు 59 రోజుల సమయం 

చివరి 10 లక్షల టెస్టులు 18 రోజుల్లోనే 

బుధవారం ఒక్క రోజే 8వేల మందికిపైగా డిశ్చార్జి 

సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ కరోనా టెస్టుల్లో దేశంలోనే అగ్రస్థానంలోఉన్న ఆంధ్రప్రదేశ్‌ మరో మైలురాయిని అధిగమించింది. బుధవారం ఉదయం 10 గంటల సమయానికి ఏపీలో రికార్డు స్థాయిలో 30 లక్షలకు పై చిలుకు పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా తొలికేసు వెలుగులోకి వచ్చేనాటికి ఒక్క ల్యాబ్‌ కూడా లేదు. ఇలాంటి పరిస్థితిని అధిగమించి ఐదు నెలల్లోనే 14 వైరాలజీ ల్యాబొరేటరీలు, 85 ట్రూనాట్‌ మెషీన్ల ద్వారా 30,19,296 టెస్టులు చేయగలిగే సామర్థ్యాన్ని సాధించింది. మెరుగైన వైద్య సదుపాయాలున్న కర్ణాటక, కేరళ, గుజరాత్‌లాంటి రాష్ట్రాలు సైతం కరోనా టెస్టుల్లో ఏపీతో పోటీపడలేక పోయాయి. 

► దేశవ్యాప్తంగా 30 లక్షల కరోనా టెస్టులు చేసిన రాష్ట్రాలు నాలుగు మాత్రమే ఉన్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌లు మాత్రమే 30 లక్షల టెస్టులు చేశాయి. వీటిల్లో ఏపీలోనే మృతుల శాతం అతి తక్కువగా కేవలం 0.92 శాతం మాత్రమే ఉంది. 
► జనాభా ప్రాతిపదికన చిన్న రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ ప్రతి పది లక్షల జనాభాకు 56,541 టెస్టులు చేస్తూ దేశంలోనే  అగ్రస్థానంలో కొనసాగుతోంది. జూలైలో 10 లక్షల టెస్టులు చేయగా ఆగస్ట్‌లో 18 రోజుల్లోనే 10 లక్షల టెస్టులు నిర్వహించడం గమనార్హం. ప్రస్తుతం 14 వైరాలజీ ల్యాబులు, 85 ట్రూనాట్‌ ల్యాబులతో పాటు ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులు చేస్తున్నారు.

‘తూర్పు’లో అత్యధికం.. 
► గత 24 గంటల్లో 57,685 టెస్టులు చేయగా 9,742 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. బుధవారం ఒక్కరోజే 8 వేల మందికిపైగా డిశ్చార్జి కాగా కోవిడ్‌తో 86 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1,399 కేసులు, అత్యల్పంగా కృష్ణా జిల్లాలో 281 కేసులు నమోదయ్యాయి.  
► ఇప్పటివరకూ 30,19,296 టెస్టులు చేయగా 3,16,003 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. 2,26,372 మంది కోలుకోగా 86,725 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కోవిడ్‌ కారణంగా 2,906 మంది మృతిచెందారు. 

మరిన్ని వార్తలు