పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి..  కీలక సూచనలివే!

21 Jan, 2023 10:11 IST|Sakshi

997 కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేసిన పోలీస్‌ నియామక మండలి 

అభ్యర్థులకు తగిన సూచనలతో నోట్‌ విడుదల 

నిమిషం ఆలస్యమైనా అనుమతించరు! 

సాక్షి, అమరావతి: పోలీసు కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి ఉద్దేశించిన ప్రిలిమినరీ పరీక్షకు సమయపాలనను కచ్చితంగా పాటించాలని పోలీసు నియామక మండలి నిర్ణయించింది. నిర్ణీత సమయానికి కంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకేంద్రంలోకి అనుమతించరనే విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలని స్పష్టం చేసింది.

రాష్ట్రంలో 6,100 పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు మొత్తం 5.03 లక్షలమంది దరఖాస్తు చేశారు. ఈ పోస్టుల భర్తీకి ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 997 కేంద్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించే ఈ పరీక్షకు పోలీసు నియామక మండలి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసింది. పరీక్ష సజావుగా నిర్వహించేందుకు

అభ్యర్థులకు కొన్ని కీలక సూచనలు చేసింది. అవి.. 
అభ్యర్థులు ఒకరోజు ముందుగానే తమ పరీక్షకేంద్రాన్ని సందర్శించి నిర్ధారించుకోవాలి.  
అభ్యర్థులను ఆదివారం ఉదయం 9 గంటల నుంచి పరీక్షకేంద్రంలోకి అనుమతిస్తారు. 
ఉదయం 10 గంటల తరువాత ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షకేంద్రంలోకి అనుమతించరు.  
మొబైల్‌ ఫోన్‌/సెల్యూలార్‌ ఫోన్, ట్యాబ్‌/ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్, బ్లూటూత్‌ పరికరాలు/రికార్డింగ్‌ పరికరాలు, కాలిక్యులేటర్, లాగ్‌ టేబుళ్లు, వాలెట్, పర్సు, నోట్స్, చార్టులు, పేపర్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను పరీక్షకేంద్రంలోకి అనుమతించరు. వాటిని పరీక్షకేంద్రం వద్దకు తీసుకురాకూడదు. వాటిని భద్రపరిచేందుకు పరీక్షకేంద్రం వద్ద ఎలాంటి ఏర్పాట్లు ఉండవు.  
అభ్యర్థులు ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్, ఓటరు కార్డు, రేషన్‌ కార్డు వంటి ఏదైనా ఒక ఒరిజినల్‌ గుర్తింపు కార్డు తీసుకురావాలి. 
హాల్‌టికెట్, బ్లూ/బ్లాక్‌ బాల్‌పాయింట్‌ పెన్‌ తీసుకురావాలి.    

మరిన్ని వార్తలు