ఎస్సై ఆత్మహత్యను రాజకీయాలకు వాడుకుంటారా?

22 Jan, 2021 12:30 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ అధికారుల సంఘం

గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): గుడివాడ టూటౌన్‌ ఎస్సై విజయకుమార్‌ మరణాన్ని రాజకీయ స్వలాభం కోసం వాడుకోవడం హేయమైన చర్య అని పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అ«ధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జనుకుల శ్రీనివాసరావు, ఎండీ మస్తాన్‌ఖాన్‌ పేర్కొన్నారు. విజయవాడలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రెండురోజుల కిందట ఎస్సై విజయ్‌కుమార్‌ ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఆయన మరణానికి గల కారణాలను వక్రీకరిస్తూ, అవాస్తవాలు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారన్నారు. 

పేకాట శిబిరాలపై దాడుల నేపథ్యంలో ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారంటూ అవాస్తవాలను ప్రచారం చేస్తూ కేసు దర్యాప్తును పక్కదారి పట్టించడం విచారకరమని చెప్పారు. రాజకీయాల్లో ఇంత దిగజారుడుతనాన్ని మునుపెన్నడూ చూడలేదన్నారు. ఎస్సై విజయ్‌కుమార్‌ కేసు ప్రాథమిక విచారణలో ఉందని, దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకి వచ్చి ప్రజలకు నిజాలు తెలిసే అవకాశం ఉందని చెప్పారు. అవాస్తవాలు ప్రచారం చేసే వ్యక్తులు ఏస్థాయిలో ఉన్నా వారిపై న్యాయ పోరాటం చేయడానికి తమ సంఘం వెనుకాడబోదన్నారు. ఎస్సై మరణంపై దేవినేని ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 
(చదవండి: ఎస్‌ఐ సూసైడ్‌: జైలుకు బ్యూటీషియన్‌)

అచ్చెన్నాయుడు బెదిరింపులకు  భయపడం
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోలీసులను బెదిరించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇటువంటి బెదిరింపులకు  భయపడమని శ్రీనివాసరావు చెప్పారు.  అచ్చెన్నాయుడుపై చట్టపరమై న చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసు వ్యవస్థపై వ్యాఖ్యలతో హీరోలవుదామని భావించేవారు ఎప్పటికీ జీరోలుగానే మిగిలిపోతారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఎం.సోమశేఖ రరెడ్డి, ఎం.కామరాజ్, జ్యోతినాథ్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు