ప్రెస్‌ అకాడమీ ఆధ్వర్యంలో కోర్సులు నిర్వహిస్తాం: శ్రీనాథ్‌రెడ్డి

21 Jul, 2021 12:09 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ప్రెస్‌ అకాడమీ సొంతంగా సర్టిఫికెట్ కోర్సు నిర్వహిస్తుందని ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి తెలిపారు. శిక్షణా కార్యక్రమంలో 6వేల మంది జర్నలిస్టులు పాల్గొన్నారని చెప్పారు. ఈయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ..  జర్నలిస్టుల స్థితిగతులపై సమీక్షించామని, జర్నలిస్టుల వృత్తి నైపుణ్యం కోసం కృషి చేస్తామని తెలిపారు. యూజీసీ నిబంధనలకు అనుగుణంగా సర్టిఫికెట్ కోర్సు పెడుతున్నామని చెప్పారు. ప్రెస్‌ అకాడమీ ఆధ్వర్యంలో కోర్సులు నిర్వహిస్తామని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నాలుగు సబ్జెక్ట్‌లను రూపొందించామని వివరించారు. విక్రమసింహపురి వర్సిటీ ఆధ్వర్యంలో పరీక్షల నిర్వహణ ఉంటుందన్నారు. గ్రామీణ జర్నలిస్టులకు మేలు చేసేలా అనేక పుస్తకాలు కూడా ప్రచురించామని, జర్నలిస్టులు వృత్తిలో భాగంగా యూనివర్సిటీలో చదివేందుకు కుదరడం లేదని చెప్పారు. అలాంటి వారికి మేలు చేసేలా యూజీసీ నిబంధనలకు అనుగుణంగా 3 నెలల సర్టిఫికెట్ కోర్స్ పెడుతున్నామని చెప్పారు. 

ప్రెస్ అకాడెమీ అద్వర్యంలో ఈ కోర్సులను నిర్వహిస్తామని, ఆన్‌లైన్‌ ద్వారా క్లాసులు నిర్వహిస్తామన్నారు. వాటిలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నాలుగు సబ్జెక్ట్స్ రూపొందించామని, వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లతో పాటు సీనియర్ జర్నలిస్టులతో క్లాసులు చెప్పిస్తామన్నారు. విక్రమసింహపురి యూనివర్సిటీ 3 నెలల తర్వాత పరీక్షలు నిర్వహిస్తుందని, జర్నలిస్టులతో పాటు ఆసక్తి ఉండి డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపారు. జర్నలిస్టులకు 1500, నాన్ జర్నలిస్టులకు 3000 ఫీజ్ ఉంటుందని, జర్నలిస్టుల ఫీజుతో సగం అకాడెమీ భరిస్తుందన్నారు. దేశంలో ఇంత తక్కువ ఫీజుతో సర్టిఫికెట్ కోర్స్ నిర్వహించడం ఇదే ప్రధమని, మంచి ప్రతిభ చూపిన వారికి ఇంటర్న్‌షిప్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. మంచి ప్రతిభ ఉంటే ఉద్యోగాలు ఇప్పించడంలోనూ అకాడెమీ కృషి చేస్తోందని గుర్తుచేశారు.

విక్రమసింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రారర్‌ ఎల్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటికే జర్నలిస్టులు యూనివర్సిటీల్లో జర్నలిజం చేసేందుకు ఎంఓయూలు చేసుకుని ఫీజ్ రాయితీ ఇస్తున్నామన్నారు. ఇప్పుడు ఈ సర్టిఫికెట్ కోర్స్ వల్ల జర్నలిస్టులకు, నాన్ జర్నలిస్టులకు ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. 

>
మరిన్ని వార్తలు