ఏపీ ఎంతో నష్టపోయింది.. హోదా ఇవ్వండి: సీఎం జగన్‌

20 Feb, 2021 16:18 IST|Sakshi

పోలవరం అంచనా సవరణలు ఆమోదించండి

విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోండి

నీతి ఆయోగ్‌ సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌

వైద్య కళాశాలల అనుమతికి విజ్ఞప్తి

అమరావతి: విభజనతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎంతో నష్టపోయిందని, మౌలిక వసతులు, ఉద్యోగ అవకాశాల కల్పన, ఆర్థికంగా పుంజుకోవడంతో పాటు, పారిశ్రామికంగా వేగంగా ఎదగడం వంటివి ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా’తోనే సాధ్యమవుతుందని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీ నుంచి వర్చువల్‌ విధానంలో జరిగిన నీతి ఆయోగ్‌ 6వ పాలక మండలి సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. ఉత్పత్తి, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, మానవ వనరుల అభివృద్ధి, క్షేత్రస్థాయిలో సేవల డెలివరీ, ఆరోగ్యం, పౌష్టికాహారం అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని విభజనకు ముందు పార్లమెంటు సాక్షిగా ప్రకటించినట్లు గుర్తుచేశారు. ఏపీలో కనీసం టయర్‌-1 నగరం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమావేశంలో మాట్లాడిన అంశాలు సీఎం వైఎస్‌ జగన్‌ మాటల్లోనే..

‘కోవిడ్‌ మహమ్మారితో ఆర్థిక పరిస్థితి తలకిందులైన నేపథ్యంలో జరుగుతున్న నీతి ఆయోగ్‌ సమావేశం ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. కోవిడ్‌ కారణంగా దెబ్బ తిన్న దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాల మీదకు ఎక్కించడానికి ఉన్న అవకాశాలన్నింటినీ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారం, సంప్రదింపుల ద్వారా పరిశీలించాలి. దీనికోసం అర్థవంతమైన చర్చలు జరగాలి. దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునేలా ఒక నిర్దిష్ట విధానాన్ని రూపొందించుకోవాలి’ అని సీఎం వైఎస్‌ జగన్ నీతి ఆయోగ్‌ సమావేశంలో తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరు ప్రధాన అంశాలు అత్యంత కీలకమైనవని పేర్కొన్నారు. 

‘భారత్‌ను ఉత్పత్తి, తయారీ రంగంలో అద్భుత విజయాలు సాధించిన దేశాలు అవలంభించిన విధానాలను సమగ్రంగా అధ్యయనం చేయాలి. అన్ని వాస్తవాలను నిశితంగా విశ్లేషించుకోవాలి. నా అభిప్రాయం ప్రకారం ఉత్పత్తి, తయారీ రంగంలో భారత్‌ విజయానికి ఐదు రకాల అంశాలు అవరోధంగా మారాయి’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ‘రుణాలపై అధిక వడ్డీల భారం, విద్యుత్‌ ఖర్చులు అధికంగా ఉండడం, భూ సేకరణలో జాప్యం,  అనుమతుల మంజూరులో సంక్లిష్టత, దేశంలో ఉత్పత్తి, తయారీ రంగానికి అవరోధంగా మారాయి. కాబట్టి వీటన్నింటిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సంప్రదింపులు, చర్చల ద్వారా సంస్కరణలు తీసుకువచ్చి ఉత్పత్తి, తయారీ రంగంలో ఉన్న అవరోధాల నుంచి గట్టెకాల్సి ఉంది’ అని సీఎం జగన్‌ చెప్పారు.

వడ్డీల భారం తగ్గించాలి
మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వాలు పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ వంటి ఆర్థిక సంస్థల నుంచి తీసుకునే రుణాలకు కూడా అధిక వడ్డీ, అంటే 10 నుంచి 11 శాతం వరకు వార్షిక వడ్డీలు చెల్లించాల్సి వస్తోందని సీఎం వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థలకే ఈ పరిస్థితి ఉంటే, ఇక ప్రైవేటు రంగం పరిస్థితి ఏమిటన్నది ఆలోచించండి అని పేర్కొన్నారు. వడ్డీ భారం మోస్తూ, ఉత్పత్తి, తయారీ రంగం ఎలా పురోగమిస్తుంది? అని ప్రశ్నించారు. ఈ విషయంలో ఇతర దేశాలతో ఎలా పోటీ పడగలుగుతాము? అని సందేహం వ్యక్తం చేశారు. తయారీ రంగంలో ముందుంటున్న దేశాల్లో పరిశ్రమలకు ఇచ్చే రుణాలకు వడ్డీ రేట్లు 2 నుంచి 3 శాతానికి మించి ఉండటం లేదని గుర్తుచేశారు. విద్యుత్‌ టారిఫ్‌, కొన్ని దేశాల్లో యూనిట్‌ విద్యుత్‌ను రూ.3 కంటే తక్కువకే సరఫరా చేస్తున్నారని సీఎం జగన్‌ తెలిపారు.

‘ఇక రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తోంది. భారత్‌ను ఉత్పత్తి, తయారీ రంగానికి కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో పని చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను  అనుసరించి, కొత్తగా ఏర్పాటు అయ్యే పరిశ్రమలకు ‘పనితీరు ఆధారంగా రాయితీలు’ (పర్ఫార్మెన్స్‌ లింక్‌డ్‌ ఇన్సెంటివ్‌ స్కీమ్‌)ను ప్రోత్సహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జిల్లా వాణిజ్య సంస్కరణ కార్యాచరణ ప్రణాళికకు అనుగుణంగా 229 సంస్కరణలు అమలు చేస్తోంది’ అని సీఎం జగన్‌ నీతి ఆయోగ్‌ సమావేశంలో వివరించారు. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు పూర్తిగా సానుకూల పరిస్థితులు కల్పించడంతో పాటు, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంలో ఎంతో సాధించాల్సి ఉందని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా దాదాపు 60 శాతం వ్యవసాయంపై ఆధారపడగా, రాష్ట్రంలో దాదాపు 62 శాతం మంది ఆధారపడి జీవిస్తున్నారని సీఎం జగన్‌ తెలిపారు. ఈ రంగంలో ఉన్న అవరోధాలను గట్టెక్కితే ఎంతో ప్రోత్సహించినట్లు అవుతుందని పేర్కొన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఐదు రకాల చర్యలు చేపట్టాల్సి ఉందని సీఎం జగన్‌ సూచించారు. పంటల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, నాణ్యమైన విత్తనాలు, సర్టిఫై చేసిన ఎరువులు, పురుగు మందులు అందుబాటులోకి తేవడం, పంటల స్టోరేజీ, గ్రేడింగ్, ప్రాసెసింగ్‌లో కొత్త టెక్నాలజీ వినియోగం, పంటలను సరైన ధరకు ఫాం గేట్‌ వద్దే అమ్ముకునేలా చర్యలు తీసుకోవాల్సి ఉందని సీఎం జగన్‌ వివరించారు.

రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర రానప్పుడు ప్రభుత్వమే ఆదుకునేలా ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలని సూచించారు. ఆ నిధి ఏర్పాటుకు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి తక్కువ రుణానికే రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు అందేలా చూడాలని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు నష్టపోయితే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. భూమి విస్తీర్ణం కూడా పెరగాలని, ఈ చర్యలతో వ్యవసాయ రంగం బలోపేతమవడంతో పాటు, రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని వెల్లడించారు.

రైతులకు ‘భరోసా’
రైతులకు సహాయకారిగా, అండగా ఉండేందుకు రాష్ట్రంలో 10,731 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామని నీతి ఆయోగ్‌ సమావేశంలో సీఎం జగన్‌ తెలిపారు. విత్తనాల నుంచి పంటలు అమ్ముకునే వరకు రైతులకు చేదోడుగా ఉండేలా ఈ కేంద్రాలు పని చేస్తున్నాయని చెప్పారు. మల్టీపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. డ్రై స్టోరేజీలు, డ్రై ప్లాట్‌ఫామ్స్, కలెక్షన్‌ కేంద్రాలు, ప్రైమరీ ప్రాసెసింగ్‌, ఎసెయింగ్‌ ఎక్విప్‌మెంట్‌, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు, ఆటోమేటిక్‌ పాల సేకరణ కేంద్రాలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటుచేస్తున్నట్లు వివరించారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ఏర్పాటు చేయడాన్ని అభినందిస్తున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. రాష్ట్రంలో ఇంకా సేంద్రీయ వ్యవసాయ విధానాలను ప్రోత్సహిస్తున్నాం. ప్రతి ఆర్బీకేలో సేంద్రీయ వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పిస్తూ, ఆ విధానాన్ని ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. సాగునీటి రంగానికి ఎంతో అండగా నిల్చే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ఖర్చులో సవరించిన అంచనాలకు కేంద్రం వెంటనే ఆమోదం తెలపాలని సీఎం జగన్‌ కోరారు.

రూ.2.48కే యూనిట్‌ విద్యుత్‌
దారిద్య్ర నిర్మూలన, ఆర్థిక పురోగతిలో ఇది ఎంతో కీలకమైన అంశమని సీఎం జగన్‌ తెలిపారు. అందుకే విద్యుత్, రహదారులు, నౌకాశ్రయాల వంటి వాటితో పాటు, సామాజిక మౌలిక సదుపాయాలైన విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం వంటి ముఖ్యమైన అంశాలలో ఏ మాత్రం నిర్లక్ష్యం తగదని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో సంప్రదాయేతర విద్యుత్‌ను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఆ దిశలో 10 వేల మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఇటీవల టెండర్‌ ప్రక్రియను కూడా చేపట్టామని వివరించారు. రాష్ట్రంలో 30 ఏళ్ల పాటు యూనిట్‌ విద్యుత్‌ కేవలం రూ.2.48కే అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

రాష్ట్రం ఇప్పుడు యూనిట్‌ విద్యుత్‌ను సగటున రూ.5.2 కు కొనుగోలు చేస్తుండగా సౌర విద్యుత్‌తో అది గణనీయంగా తగ్గనుందని సీఎం జగన్‌ చెప్పారు. రివర్స్‌ పంపింగ్‌ టెక్నాలజీ ద్వారా మరో 33 వేల మెగావాట్ల కరెంటు ఉత్పత్తి దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. కేంద్రం కూడా చొరవ తీసుకుని రివర్స్‌ పంపింగ్‌ టెక్నాలజీ ద్వారా విద్యుత్‌ ఉత్పత్తికి సంబంధించి జాతీయ స్థాయిలో ఒక విధానం రూపొందించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. విద్యుత్‌ ఉత్పత్తి కోసం తీసుకున్న రుణాలపై ఇప్పుడు ఉన్న వడ్డీలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నా అని విజ్ఞప్తి చేశారు.

సామాజిక, ఆర్థిక పురోగతిలో విద్య, వైద్య రంగాలు ఎంతో కీలకమైనవని, ఆ రెండింటిలో సమగ్ర మార్పులకు శ్రీకారం చుడుతూ రాష్ట్ర ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమం చేపట్టిందని సీఎం జగన్‌ గుర్తుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 46 వేల విద్యాలయాలతో పాటు, ప్రభుత్వ హాస్టళ్లను పూర్తిగా మారుస్తున్నట్లు వివరించారు. విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు సాధించడంతో పాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేలా ఆంగ్ల మాధ్యమం తీసుకువచ్చామని చెప్పారు.

నాడు-నేడుతో వైద్యారోగ్య రంగ అభివృద్ధి
విభజనతో రాష్ట్రం నష్టపోయిందనే విషయం మీ అందరికీ తెలుసని సీఎం జగన్‌ తెలిపారు. వైద్య, ఆరోగ్య రంగ అభివృద్ధి కోసం నాడు-నేడు కార్యక్రమం అమలు చేస్తున్నట్లు, అన్ని ఆస్పత్రుల్లో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు వివరించారు. గ్రామాల్లో 10 వేలకు పైగా విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌ ప్రారంభం, కొత్తగా 16 వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. వాటిలో మూడింటికి కేంద్రం ఇప్పటికే అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. మిగిలిన 13 వైద్య కళాశాలలకు కూడా అనుమతితో పాటు, ఆర్థికంగా సహాయం చేయాలని కోరుతున్నట్లు సీఎం జగన్‌ విజ్ఞప్తి చేశారు. 

గ్రామీణ ప్రాంతాల్లో  ఏడాది పాటు వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది తప్పనిసరిగా పని చేసేలా కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. పరిపాలనలో ఎన్నో చర్యలు తీసుకువచ్చామని, పరిపాలన వికేంద్రీకరణే కాకుండా సమర్థవంతంగా టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఎక్కడా అవినీతి, వివక్షకు తావు లేకుండా పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు.

అన్ని గ్రామాలకు ఇంటర్నెట్
రాష్ట్రవ్యాప్తంగా 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ నియామకం చేసినట్లు సీఎం జగన్‌ నీతి ఆయోగ్‌ సమావేశంలో చెప్పారు. మొత్తం 540 రకాల అత్యవసర సేవలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందిస్తున్నట్లు వివరించారు. ‘భారత్‌ నెట్‌ ప్రాజెక్ట్‌ దిశలోనే రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామాలకూ ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించడం కోసం చర్యలు చేపడుతోంది. గ్రామస్థాయిలో ప్రతి పౌరుడికీ, ప్రభుత్వ వ్యవస్థకూ ఇంటర్నెట్‌ సదుపాయం కల్పిస్తాం’ అని సీఎం జగన్‌ ప్రకటించారు. గ్రామాల్లో పబ్లిక్‌ డిజిటల్‌ లైబ్రరీలను అందుబాటులోకి తీసుకువచ్చి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. 

>
మరిన్ని వార్తలు