సరిపడినంత మంది సిబ్బంది ఏర్పాటుకు చర్యలు
3, 4, 5 తరగతుల్లో 4 సబ్జెక్టుల బోధనకు 4 ఎస్జీటీ, లేదా ఎస్ఏలు
6, 7 తరగతుల్లో 6 సబ్జెక్టులకు ఆరుగురు ఎస్ఏలు
8, 9, 10 తరగతుల్లో 7 సబ్జెక్టుల కోసం ఏడుగురు ఎస్ఏలు
1, 2 తరగతులతో ఉండే ప్రాథమిక స్కూళ్లకు కిలోమీటర్ దూరంలోని అంగన్వాడీల అనుసంధానం
సాక్షి, అమరావతి: నూతన విద్యా విధానంలో ఏర్పాటవుతున్న స్కూళ్లలో టీచర్ల కొరత లేకుండా పాఠశాల విద్యా శాఖ చర్యలు చేపడుతోంది. పిల్లల్లో చిన్నప్పటి నుంచే చదువుల్లో గట్టి పునాది వేసేందుకు ఫౌండేషన్ స్కూల్ విధానానికి రాష్ట్రంలో శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. పిల్లల్లో ఆరో ఏడు వచ్చేసరికే అక్షర జ్ఙానాన్ని పెంపొందించడం, 3వ తరగతి నుంచి సబ్జెక్టు వారీ బోధనతో ఆ పునాదులను మరింత పటిష్టం చేయడం ఈ విధానం ప్రధాన లక్ష్యం. ఇందుకోసం శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, ప్రీ హైస్కూళ్లు, హైస్కూళ్లు, హైస్కూల్ ప్లస్ స్కూళ్లు అనే ఆరంచెల విధానాన్ని ప్రవేశపెట్టారు.
ఈ విధానంలో ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను అదే ఆవరణ, లేదా 250 మీటర్ల లోపు హైస్కూళ్లకు అనుసంధానిస్తారు. ఈ స్కూళ్లలో 3, 4, 5 తరగతుల విద్యార్థులకు కూడా సబ్జెక్టులవారీగా మంచి బోధన అందుతుంది. హైస్కూళ్లలోని ల్యాబ్లు, గ్రంధాలయాలు, ఆట స్థలం, క్రీడా పరికరాలు కూడా ఈ విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. తద్వారా ప్రాథమిక పాఠశాలల్లో అందని విజ్ఞానాన్ని ఇక్కడ పొందుతారు. హైస్కూళ్లలో తరగతులు పెరుగుతున్న నేపథ్యంలో టీచర్ల కొరత ఏర్పడకుండా బోధనా సిబ్బందిని సర్దుబాటు చేసేలా రీజనల్ జాయింట్ డైరెక్టర్లకు విద్యా శాఖ ఆదేశాలు జారీచేసింది. ముందుగా పిల్లల ఎన్రోల్మెంట్ను అనుసరించి టీచర్లు అవసరమున్న స్కూళ్లను గుర్తించాలని పేర్కొంది.
టీచర్ల సర్దుబాటుకు విధివిధానాలు..