సీఎం జగన్‌ అధ్యక్షతన ఎస్‌ఐపీబీ భేటీ.. పలు భారీ పరిశ్రమల ప్రతిపాదనకు ఆమోదం

7 Feb, 2023 18:46 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన ఈ సమావేశంలో పలు భారీ పరిశ్రమల ప్రతిపాదనకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు సీఎం జగన్‌ మాట్లాడుతూ.. పరిశ్రమలు పెట్టేవారికి చేదోడుగా నిలవాలని ఆదేశించారు. అనుకున్న సమయంలోగా నిర్మాణాలు పూర్తయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. నిర్దేశించుకున్న సమయంలోగా వాటి కార్యకలాపాలు ప్రారంభం కావాలని తెలిపారు. 

రానున్న ప్రతి పరిశ్రమలో కూడా ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే రావాలని సీఎం జగన్‌ మరోసారి స్పష్టం చేశారు. ఆ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చాక… విద్యుత్ ప్రాజెక్ట్‌ల విధానంలో కీలక మార్పులు తీసుకు వచ్చామని పేర్కొన్నారు. పవర్‌ ప్రాజెక్టుల ద్వారా తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికే ఆదాయం వచ్చే పరిస్థితులు తీసుకువచ్చామన్నారు. 

తీసుకుంటున్న భూమికి ఎకరాకు ఏడాదికి రూ.31వేలు లీజు కింద చెల్లింపులు వచ్చాయన్నారు సీఎం జగన్‌. దీనివల్ల కరవు ప్రాంతాల్లోని రైతులకు చక్కటి మేలు జరుగుతుందని తెలిపారు. అంతేగాక ప్రతి మెగావాట్‌కు లక్ష రూపాయల చొప్పున రాష్ట్రానికి కంపెనీలు చెల్లిస్తున్నాయని పేర్కొన్నారు. ఎస్జీఎస్టీ రూపంలో కూడా రాష్ట్రానికి రెవెన్యూ వస్తుందన్నారు.  గ్రిడ్ బాధ్యతలు కూడా రాష్ట్రానికి లేవని.. దీంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వస్తున్నాయని అన్నారు.
చదవండి: సబ్‌ప్లాన్‌ అంటే లోకేష్‌కు తెలుసా?.. మంత్రి నాగార్జున సెటైర్లు

మరిన్ని ప్రతిపాదనలకు ఎస్ఐపీబీ ఆమోదం
1. కృష్ణా జిల్లా మల్లవల్లి పార్కులో ఇథనాల్ఇంధన తయారీకి ముందుకు వచ్చిన అవిశా  ఫుడ్స్‌ మరియు ఫ్యూయెల్స్‌ కంపెనీ ప్రతిపాదన.
►మొత్తంగా రూ.498.84 కోట్ల పెట్టుబడి, ప్రత్యక్షంగా, పరోక్షంగా 3,300 మందికి ఉపాధి. రోజుకు 500 కిలో లీటర్ల సామర్ధ్యం
► ఈ ఏడాది జూన్ లో పనులు ప్రారంభించి, వచ్చే ఏడాది జూన్‌ నాటికి పూర్తిచేయాలని లక్ష్యం.

2. కడియం వద్ద ఆంధ్రా పేపర్ మిల్స్‌ విస్తరణ ప్రాజెక్టు.
► మొత్తంగా రూ. 3,400 కోట్ల పెట్టుబడులు
►ప్రత్యక్షంగా 2,100 మందికి ఉద్యోగాలు.
► 2025 నాటికి పూర్తిచేయాలని లక్ష్యం.

౩. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్కు
►మొదటి విడతలో రూ.55వేల కోట్లు, రెండో విడతలో రూ.55వేల కోట్లు పెట్టుబడి.
►మొత్తంగా రూ.1,10,000 కోట్ల పెట్టుబడి.
►ఫేజ్ వన్‌లో  30 వేలమందికి, ఫేజ్‌ టూ లో 31వేల మందికి ఉద్యోగాలు. మొత్తంగా 61వేల మందికి ఉద్యోగాలు.
► ఈ పార్క్ లో గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్అమ్మోనియా, గ్రీన్‌ మిథనాల్, హైడ్రోజన్‌ సంబంధిత ఉత్పత్తులు.
►మొదటి విడతను 2027 నాటికి, రెండో విడతను 20౩౩ నాటికి పూర్తిచేయాలని లక్ష్యం.
► ఇంధన రంగంలో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు మార్చుకుని కొత్త తరహా ఇంధనాల ఉత్పత్తి లక్ష్యంగా ముందడుగు వేస్తున్న ఎన్టీపీసీ.

4. శ్రీకాళహస్తి, పుంగనూరుల్లో ఎలక్ట్రో  స్టీల్‌ కాస్టింగ్‌ లిమిటెడ్‌… ఫ్యాక్టరీలు.
►డీఐ పైపులు, ఫెర్రో అల్లాయిస్ తయారీ
►శ్రీకాళహస్తిలో రూ.915.43 కోట్ల పెట్టుబడి, పుంగనూరులో రూ.171.96కోట్లు పెట్టుబడి.
► మొత్తంగా రూ. 1087 కోట్ల పెట్టుబడి.
►ప్రత్యక్షంగా 2,350 మందికి ఉద్యోగాలు.
► డిసెంబర్2023 నాటికి ఫ్యాక్టరీ నిర్మాణ పనులు పూర్తిచేయాలని లక్ష్యం.

5. రామాయపట్నంలో అకార్డ్‌ గ్రూప్‌ ఫ్యాక్టరీ.
►రూ. 10వేల కోట్ల పెట్టుబడి.
►కాపర్‌ కాథోడ్, కాపర్‌ రాడ్, సల్ఫూరిక్‌ యాసిడ్‌, సెలీనియం మరియు ప్రత్యేక ఖనిజాల తయారీ. 
►ప్రత్యక్షంగా 2500 మందికి ఉద్యోగాలు.
► మే 2023లో ప్రారంభమై, జూన్2025 నాటికి పూర్తిచేయాలని లక్ష్యం.
► ప్రభుత్వం రాష్ట్రంలో బాక్సైట్‌ తవ్వకాలను నిషేదించిన నేపథ్యంలో తమ కంపెనీ ప్రణాళికలను మార్చుకున్న జేఎస్‌డబ్యూ అల్యూమినియం లిమిటెడ్‌ ఫ్యాక్టరీ కోసం ప్రెవేట్‌ వ్యక్తుల నుంచి సేకరించిన 985 ఎకరాల భూమిలో ఎంఎస్‌ఎంఈ పార్క్‌ ఏర్పాటుకు ప్రతిపాదన ఆమోదించిన ఎస్‌ఐపీబీ

6. కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో విండ్, సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్‌లు
►1000 మెగావాట్ల విండ్, మరియు 1000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్‌లు 
►ఏర్పాటు చేయనున్న ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌.
►నాలుగు విడతల్లో మొత్తంగా రూ.10,500 కోట్లపెట్టుబడి.
► 2వేలమందికి  ఉద్యోగాలు.
► దశల వారీగా పూర్తిస్ధాయిలో    మార్చి 2027 నాటికి పూర్తిచేయాలని లక్ష్యం.

7. విశాఖపట్నంలోని కాపులుప్పాడలో మరో 100 మెగావాట్ల డేటా సెంటర్.
►100 మెగావాట్ల డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తున్న వైజాగ్‌ టెక్‌ పార్క్‌ లిమిటెడ్‌   .
►మొదటి విడతలో 10 మెగావాట్లతో డేటా సెంటర్‌, మూడేళ్ళలో పూర్తికి కంపెనీ సన్నాహాలు. 
► మొత్తంగా రూ.7,210 కోట్ల పెట్టుబడి, ప్రత్యక్షంగా 14,825 మందికి, పరోక్షంగా 5,625 మందికి, మొత్తంగా 20,450 మందికి ఉద్యోగాలు.
►ఇప్పటికే ఏర్పాటు చేస్తున్న 200 మెగావాట్ల డేటా పార్క్ కి ఇది అదనం. 

8. రాష్ట్రంలో పెట్టబుడులకు ముందుకు వచ్చిన వింగ్‌టెక్‌ మొబైల్‌ కమ్యూనికేషన్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌
►రూ. 1489.23కోట్ల పెట్టుబడి. తిరుపతిలో పరిశ్రమ.
►15 వేలమందికి ఉద్యోగాలు.
►టెలీ కమ్యూనికేషన్ఇంటిగ్రేషన్, సెమికండక్టర్, ఆప్టికల్‌ మాడ్యూల్స్‌ ను తయారుచేస్తున్న కంపెనీ. 

9. భోగాపురంలో 90 ఎకరాల స్థలంలో ఐటీ పార్కు ఏర్పాటు.
►దీనికి ఎస్ఐపీబీ ఆమోదం.
►అత్యంత ఆధునిక  సదుపాయాలతో ఐటీ పార్కు ఏర్పాటు కావాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మోడళ్లను పరిశీలించి ఆమేరకు ప్రణాళికలు రూపొందించుకోవాలని సీఎం ఆదేశం.

మరిన్ని వార్తలు