వెంకన్న సన్నిధిలో పలువురు ప్రముఖులు

22 Oct, 2020 08:59 IST|Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌, డిప్యూటీ స్పీకర్‌ కోనా రఘుపతి, గజల్‌ శ్రీనివాస్‌ వంటి ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘కుటుంబ సమేతంగా స్వామి వారి ఆశీస్సులు పోందడం చాలా సంతోషంగా ఉంది. ఎన్ని సార్లు దర్శించుకున్న, ఎన్ని సార్లు చూసిన తనివి తీరని ఒక దివ్యమంగళ స్వరూపం స్వామి వారిది. ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. త్వరగా వ్యాక్సిన్ రావాలని స్వామి వారిని కోరుకున్నాను. ఏపీలో కరోనాతో ఒక పక్క.. వరదలతో మరో పక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా సమయంలో‌ కూడా స్వామి వారిపై భక్తితో తిరుమలకు వచ్చి ఆయన ఆశీస్సులు పోందడం ఆనందదాయకం. ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మరింత శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు సాయం చేయమని స్వామి వారిని వేడుకున్నాను. గతంలో లాగానే తిరుమలకు వచ్చే పర్యాటకులకు బ్రహ్మోత్సవాల అనంతరం దర్శనం కల్పిస్తాం’ అన్నారు. (చదవండి: శ్రీవారికి కానుకగా బంగారు శఠారి)


వకుళ మాత ఆలయ నిర్మాణం చాలా సంతోషం: గజల్‌ శ్రీనివాస్‌
భారత్ సేవ్ టెంపుల్స్‌లో భాగంగా మా చిరకాల కోరిక వకుళ మాత ఆలయం నిర్మాణం జరడం చాలా సంతోషంగా ఉంది అన్నారు గజల్‌ శ్రీనివాస్‌. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాతృత్వంతో వకుళ మాత ఆలయం రూపకల్పన జరగడం చాలా ఆనందం. కరోనా సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటూ స్వచ్చ తిరుమలను అందంగా తీర్చి దిద్దిన టీటీడీని అభినందిస్తున్నాను. కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రండి’ అని కోరారు. (చదవండి: ఆయన్ని చూస్తుంటే వైఎస్సార్‌ గుర్తుకు వచ్చారు)


విపత్తుల నుంచి ప్రజలను కాపాడాలని కోరాను: కోన రఘుపతి

కరోనా‌, ప్రకృతి విపత్తుల నుంచి ప్రజలందరిని కాపాడాల‌ని స్వామి వారిని వేడుకున్నాను అన్నారు ఏపీ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి. ‘వేంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరిపై ఉంది. పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నారు. కరోనా సమయంలో టీటీడీ ఏకాంతంగా స్వామి వారి వాహన సేవలు నిర్వహించినప్పటికి ఎంతో వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తోంది’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు