G-20 Summit 2023: జీ-20 సదస్సు అతిథులతో విందులో పాల్గొన్న సీఎం జగన్‌

28 Mar, 2023 22:29 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: జీ–20 సదస్సు తొలి రోజు.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. అతిథులతో కలిసి ఆయన విందులో పాల్గొన్నారు. అనంతరం వారితో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జీ-20 రెండో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశాన్ని ఉద్దేశించి సీఎం జగన్‌ మాట్లాడుతూ, విశాఖలో మీరు గడిపిన సమయం మీకు మధురానుభూతిని మిగులుస్తుందని భావిస్తున్నానన్నారు.

‘‘ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం. మేం అధికారంలోకి వచ్చాక.. 30 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చాం. 22 లక్షల ఇళ్లు కడుతున్నాం. ఈ ఇళ్లకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం ముమ్మరంగా చర్యలు చేపడుతోంది. దీనిపై సరైన చర్చలు జరిపి.. సస్టెయిన్‌బుల్‌ పద్ధతులను సూచించాలని కోరుతున్నాను. దీనిపై సరైన మార్గనిర్దేశకత్వం అవసరం. దీనివల్ల మంచి ఇళ్లు పేదలకు సమకూరుతాయి. దీనిపై మీ నుంచి మంచి ఆలోచనలు కావాలి. సమస్యలకు మంచి పరిష్కారాలు చూపగలగాలి. ఈ అంశంపై మీరు చక్కటి చర్చలు చేయాలి. మీరు ఇక్కడ గడిపే సమయం చెరిగిపోలేని జ్ఞాపకంగా ఉంటుందని ఆశిస్తున్నాను’’ అని సీఎం జగన్‌ అన్నారు.

►జీ-20 సదస్సు అతిథులతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విందులో పాల్గొన్నారు. కాసేపట్లో జీ-20 ప్రముఖులతో సీఎం భేటీ కానున్నారు.

►ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అక్కడ నుంచి రాడిసన్ బ్లూ హోటల్‌కు ఆయన బయలుదేరారు. సీఎంకు ఎయిర్‌పోర్ట్‌లో వైఎస్సార్‌సీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో జీ-20 ప్రముఖులతో సీఎం జగన్‌ భేటీ కానున్నారు. అనంతరం వారికి మర్యాద పూర్వక విందు ఇవ్వనున్నారు.

►ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం బయలుదేరారు. జీ–20 సదస్సుకు హాజరైన ప్రతినిధు­లతో సీఎం జగన్‌ కాసేపట్లో సమావేశం కానున్నారు. అనంతరం వారికి మర్యాద పూర్వక విందు ఇవ్వనున్నారు.

►  విశాఖలో ప్రారంభమైన జీ-20 సదస్సు

►నేటి నుంచి(మంగళవారం)జీ-20 దేశాల రెండో ఇన్‌ప్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూప్‌(ఐడబ్యూజీ) సమావేశాలు జరుగనున్నాయి. ఇప్పటికే ఈనెల 3, 4 తేదీల్లో విశాఖ వేదికగా గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ను (జీఐఎస్‌) ఘనంగా నిర్వహించి దేశ, విదేశాల దృష్టిని ఆకర్షించగా, తాజాగా జరుగుతున్న జీ-20 సదస్సుతో విశాఖ నగరం మరోమారు హాట్‌ టాపిక్‌గా మారింది.

►ఈ సదస్సు వన్‌ ఎర్త్, వన్‌ ఫ్యామిలీ, వన్‌ ఫ్యూచర్‌ అనే థీమ్‌తో 28, 29, 30, 31 తేదీల్లో విశాఖలో జరగనుంది.

►నగరంలోని రాడిసన్‌ బ్లూ హోటల్‌లో నాలుగు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు జీ–20 దేశాలతో పాటు యూరోపియన్‌ దేశాలకు చెందిన 57 మంది ప్రతినిధులు విశాఖ చేరుకున్నారు.

►అతిథులను స్వాగతించడానికి ప్రత్యేక సాంస్కృతిక బృందాలను సిద్ధంచేశారు.

2,500 మందితో భద్రతా ఏర్పాట్లు
►జీ–20 సదస్సు నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు

►సుమారు 2,500 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. బందోబస్తుకు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల నుంచి కూడా సిబ్బందిని రప్పించారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా పటిష్ట ఏర్పాట్లుచేశారు.

జీ–20 దేశాలివీ..
అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా,ఫ్రాన్స్, జర్మనీ, భారత్,ఇండోనేసియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, యూకే, అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌.


సదస్సుకు హాజరుకానున్న సీఎం జగన్‌
జీ–20 సదస్సు తొలిరోజు సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హాజరవుతారు. సదస్సులోని ప్రతినిధు­లతో ముఖాముఖి మాట్లాడి అనంతరం గాలా డిన్నర్‌లో పాల్గొంటారు. రాత్రికి ముఖ్యమంత్రి తిరిగి తాడేపల్లికి పయనమవుతారు. మరోవైపు.. జీ–20 దేశాల ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి రాష్ట్ర సమాచారాన్ని అందజేస్తారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను వివరిస్తారు. ఈ సదస్సు ద్వారా విశాఖకు ప్రపంచస్థాయి గుర్తింపు లభిస్తుందని భావిస్తున్నారు.  

సదస్సు షెడ్యూల్‌ ఇలా..
►28 ఉదయం రాడిసన్‌ బ్లూ హోటల్‌లో అల్పాహారం తర్వాత ప్రధాన సమావేశం హోటల్‌లోని కన్వెన్షన్‌ హాలులో జరుగుతుంది.

►సా.3.30 నుంచి 6.30 వరకు మూడు రకాల సమావేశాలు నిర్వహిస్తారు. రాత్రి 7.30 నుంచి 9.30 వరకు హోటల్‌ సమీపంలోని బీచ్‌లో గాలా డిన్నర్‌ ఉంటుంది. దీనికి సీఎం వైఎస్‌ జగన్‌ హాజరవుతారు. ముఖ్యమంత్రి ప్రసంగం కూడా ఉంటుంది. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి.

►29న హోటల్‌ సమీపంలోని బీచ్‌లో యోగా, మెడిటేషన్, పౌష్టికాహార వినియోగంపై నిపుణులతో అవగాహన కార్యక్రమాలుంటా­యి. ఆ రోజంతా మౌలిక సదుపాయాల కల్పన అనే అంశంపై ప్రధాన సమావేశం ఉంటుంది.

►30న ఉ.10 నుంచి మ.1.30 గంటల వరకు కెపాసిటీ బిల్డింగ్‌ వర్క్‌షాపు ఉంటుంది. అనంతరం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ముడసర్లోవ, కాపులుప్పాడ ప్రాంతాల్లో విదేశీయులు పర్యటిస్తారు. స్మార్ట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్, మెగా ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ పనితీరు, జిందాల్‌ కంపెనీ పరిధిలో నిర్వహించే వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఎనర్జీ తయారీ యూనిట్‌ పనితీరు గురించి అధికారులు వివరిస్తారు.  

►31న దేశవ్యాప్తంగా ఉన్న మున్సిపల్‌ కమిషనర్లతో పట్టణీకరణ, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై సింగపూర్, దక్షిణ కొరియా ప్రతినిధులతో చర్చిస్తారు. జన్‌భాగీదారీ కార్యక్రమం కింద స్థానిక నిపుణులతో వివిధ అంశాలపై చర్చా సమావేశాలు జరుగుతాయి. అనంతరం..విదేశీ ప్రతినిధులు తిరుగు ప్రయాణమవుతారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు