RGV: ఆర్జీవీపై ఏపీ మహిళా కమిషన్‌ సీరియస్‌

25 Jun, 2022 19:19 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: ఆర్జీవీపై ఏపీ మహిళా కమిషనర్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ద్రౌపది ముర్ముపై వర్మ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ తరపున వర్మకు నోటీసులు ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. వర్మ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు.
చదవండి: అద్భుతమైన షూటింగ్‌ స్పాట్‌లు.. అవి ఎక్కడ ఉన్నాయంటే?

మహిళా భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తుందని వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. న్యూఢిల్లీలో శనివారం జాతీయ మహిళా కమిషన్ సెమినార్‌కు హాజరైన వాసిరెడ్డి పద్మ ఏపీభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. మహిళా కమిషన్ చొరవతో  ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలు (ఐసీసీ) ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేయడం సంతోషకరమన్నారు.

మహిళా కమిషన్ ఏడాది కార్యచరణ 'సబల'లో భాగంగా మహిళలపై లైంగిక వేధింపులు-పరిష్కారాల అజెండాగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఆయా వేదిల నుంచి తయారు చేసి సమర్పించిన నివేదిక నేపథ్యంలో ఏపీ సర్కారు తక్షణమే స్పందించడంపై వాసిరెడ్డి పద్మ ఏపీ సర్కారుకు కృతజ్ఞతలు తెలిపారు.

తమ రాష్ట్రంలో మహిళల భద్రతకు చేపట్టిన కార్యచరణ ప్రణాళికను జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖాశర్మకు నివేదించామన్నారు. పదిమందికి మించి మహిళలు పనిచేసే చోట అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు తప్పనిసరని.. మహిళా కమిషన్ పర్యవేక్షిస్తుందన్నారు. అదే విధంగా స్థానిక ఫిర్యాదుల కమిటీల ఏర్పాటుపై కూడా జిల్లా కలెక్టర్లతో సమీక్షిస్తామని వాసిరెడ్డి పద్మ తెలిపారు. అక్రమరవాణా నిరోధానికి పోలీసు శాఖ సమన్వయంతో మహిళా కమిషన్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆమె వివరించారు.

మరిన్ని వార్తలు