అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ వాయిదా!

4 Aug, 2020 06:11 IST|Sakshi

ఈ నెల 20 తర్వాత నిర్వహించాలని కేంద్రానికి తెలంగాణ సర్కార్‌ లేఖ 

షెడ్యూల్‌ ప్రకారం సమావేశానికి ఏపీ ప్రభుత్వం సన్నద్ధం 

నేడు కేంద్ర జల్‌ శక్తి శాఖకు అజెండా పంపేందుకు ఏర్పాట్లు

సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి ఈనెల 5న జరగాల్సిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం వాయిదా పడే అవకాశం ఉంది. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని ఈ నెల 20వ తేదీ తర్వాత  నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌కు లేఖ రాసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో బుధవారం జరగాల్సిన భేటీ వాయిదా పడే అవకాశం ఉందని కృష్ణా, గోదావరి బోర్డు వర్గాలు వెల్లడించాయి. 

షెడ్యూల్‌ ప్రకారం సిద్ధమైన ప్రభుత్వం 
► షెడ్యూల్‌ ప్రకారం అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో పాల్గొనేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్రం మార్గదర్శకాల మేరకు మంగళవారం కేంద్ర జల్‌ శక్తి శాఖకు అజెండాను పంపాలని నిర్ణయించింది. 
► కృష్ణా, గోదావరి నదులపై రెండు రాష్ట్రాలు చేపట్టిన కొత్త ప్రాజెక్టుల విషమయంలో బోర్డులకు తెలుగు రాష్ట్రాలు ఫిర్యాదు చేసుకున్నాయి. వీటిపై జూన్‌ 4న కృష్ణా బోర్డు, 5న గోదావరి బోర్డు సమావేశాలు జరిగాయి. సీడబ్ల్యూసీ అనుమతి లేని వాటిని కొత్త ప్రాజెక్టులుగానే పరిగణిస్తామని, వాటి డీపీఆర్‌లు ఇస్తే పరిశీలన, ఆమోదం కోసం అపెక్స్‌ కౌన్సిల్‌కు పంపుతామని బోర్డులు సూచించాయి.
► ఈనెల 5న అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశామని,  ఆ రోజు ఇరు రాష్ట్రాల సీఎంలు అందుబాటులో ఉంటారో లేదో తెలపాలని సీఎస్‌లకు కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి గత నెల 28న లేఖ రాసింది. 

మరిన్ని వార్తలు