త్వరలోనే ‘అదానీ’కి శంకుస్థాపన.. ఏడేళ్లలో రూ.14,634 కోట్ల పెట్టుబడులు

3 Jan, 2023 18:06 IST|Sakshi

హిల్‌–4లో 130 ఎకరాలు సిద్ధం చేసిన ఏపీఐఐసీ 

లీజు మొత్తం ప్రభుత్వానికి చెల్లించిన సంస్థ 

సరిహద్దులు సిద్ధం చేసిన ఏపీఐఐసీ 

సాక్షి, విశాఖపట్నం: రూ.14,634 కోట్లతో పాతికవేల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా విశాఖలో అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ లిమిటెడ్‌ సంస్థ ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్‌ డేటా సెంటర్‌ పార్క్‌ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. లీజు మొత్తం చెల్లించిన అదానీ కోసం హిల్‌పార్క్‌–4లో 130 ఎకరాలను ఏపీఐఐసీ సిద్ధం చేసి.. సరిహద్దులను కూడా నిర్ణయించింది. త్వరలోనే అదానీ డేటా పార్క్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన తేదీలు త్వరలోనే ఖరారు చేయనున్నారని కలెక్టరేట్‌ వర్గాలు వెల్లడించాయి.

సంస్థ కార్యకలాపాల కోసం ఈ రహదారిని విస్తరించనున్న అదానీ

డేటా సెంటర్‌ పార్క్, ఐటీ బిజినెస్‌ పార్కు, నైపుణ్యాభివృద్ధి వర్సిటీ, రిక్రియేషన్‌ సెంటర్‌ నిర్మాణాలకు మధురవాడ సర్వే నెంబర్‌ 409లో ఎకరం రూ.కోటి చొప్పున 130 ఎకరాలను ప్రభుత్వం అదానీ సంస్థకు కేటాయించింది. భూమి ఇచ్చిన మూడేళ్లలోపు కచ్చితంగా కార్యకలాపాలు ప్రారంభించాలని, ఏడేళ్లలోపు నిర్మాణాలు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో 82 ఎకరాల్లో 200 మెగావాట్ల సామర్థ్యంలో డేటా సెంటర్‌ పార్కు, 28 ఎకరాల్లో ఐటీ బిజినెస్‌ పార్కు, 11 ఎకరాల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీ, 9 ఎకరాల్లో రిక్రియేషన్‌ పార్కు ఏర్పాటు చేయనుంది.

చదవండి: (రామోజీ, రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడిది మానసిక వైకల్యం: కొడాలి నాని)

హిల్‌–4లో అదానీకి స్థలం కేటాయించినట్లు బోర్డు ఏర్పాటు చేసిన ఏపీఐఐసీ

అదానీ కోసం కేటాయించిన స్థలానికి ఎకరానికి రూ. కోటి చొప్పున లీజు మొత్తం నిర్ణయించగా.. మొత్తం రూ.130 కోట్లుని ఇటీవలే సంస్థ ప్రతినిధులు ప్రభుత్వానికి చెల్లించారు. అదానీకి అందివ్వాల్సిన భూముల సరిహద్దుల్ని ఏపీఐఐసీ సిద్ధం చేసింది. ఏడేళ్ల కాలం పాటు చెల్లించే స్టేట్‌ జీఎస్‌టీ రీయంబర్స్‌మెంట్‌ ప్రభుత్వం చెల్లించనుంది. మొదటి మూడేళ్ల కాలంలో 30 మెగా వాట్లు డేటా సెంటర్‌ పార్కు పూర్తి చేయడంతో పాటు, నాలుగేళ్ల నాటికి 60 మెగావాట్లు, 5 ఏళ్లకు 110 మెగావాట్లు, 6 ఏళ్లకు 160 మెగావాట్లు, ఏడేళ్లకు 200 మెగావాట్లు కింద మొత్తం వ్యవస్థని ఏర్పాటు చేయనున్నారు. ఉద్యోగ కల్పన విషయంలోనూ దశలవారీ పురోగతి చూపించనున్నారు.

మొదటి మూడేళ్ల కాలంలో 30 శాతం మందికి, ఐదేళ్ల నాటికి 70 శాతం, ఏడేళ్లకు 100 శాతం ఉద్యోగ, ఉపాధి కల్పన పూర్తి చేయనున్నారు. 200 మెగావాట్ల డేటాసెంటర్‌ పార్కులో 1240 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు, ఐటీ బిజినెస్‌ పార్కులో 1200 మందికి ప్రత్యక్ష ఉపాధి, ఐటీ బిజినెస్‌ పార్కు ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఐటీ కంపెనీల ద్వారా 21,000 మందికి ఉపాధి, ఉద్యోగవకాశాలు కల్పించనున్నారు. స్కిల్‌ యూనివర్సిటీ ద్వారా 500 మందికి, రిక్రియేషన్‌ ద్వారా 1000 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించేలా అదానీ సెంటర్‌ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. 

చదవండి: (పవన్‌ కల్యాణ్‌తో ఆ సినిమా నేనే ప్రొడ్యూస్‌ చేస్తా: మంత్రి అమర్నాథ్‌)

మరిన్ని వార్తలు