కోవిడ్‌ వల్లనే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు

18 Aug, 2021 04:48 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, సంఘ నాయకులు

త్వరలోనే పీఆర్‌సీ ప్రకటన 

ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు 

నెల్లూరు (అర్బన్‌): కరోనా మహమ్మారి వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ఛిన్నాభిన్నమైందని, అందుకే ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు కాస్త ఆలస్యమయ్యాయని ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక దర్గామిట్టలోని ఎన్జీవో భవన్‌లో ఆ సంఘం నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. జీతాలు కాస్త ఆలస్యం కావడానికి గత ప్రభుత్వం తెచ్చిన సీఎఫ్‌ఎంఎస్‌ విధానం కూడా మరో కారణమన్నారు.

ఇటీవల ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మాట్లాడుతూ సీఎఫ్‌ఎంఎస్‌ వల్ల నష్టం జరుగుతుందని, ఈ విధానం పనికిరాదన్నారని గుర్తు చేశారు. అందువల్ల సీఎఫ్‌ఎంఎస్‌ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని కోరారు. అడగకుండానే ప్రభుత్వం 27 శాతం ఐఆర్‌ ఇచ్చిందన్నారు. త్వరలోనే ప్రభుత్వం పీఆర్‌సీ ప్రకటించనుందన్నారు. ముఖ్యమంత్రి ఆగస్టు 15న మాట్లాడుతూ సీపీఎస్‌ రద్దు చేస్తామని తెలిపారన్నారు. ఆ హామీని త్వరగా అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మన్నేపల్లి పెంచలరావు, నాయుడు వెంకటస్వామి పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు