పశుఆరోగ్య సేవా రథాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు

20 Nov, 2022 05:30 IST|Sakshi

జిల్లాకు 8 పశువైద్యులు, 8 పారావెట్‌లు, 8 పైలట్‌ పోస్టులు 

22, 23 తేదీల్లో విజయవాడ జేడీ కార్యాలయంలో ఇంటర్వ్యూలు 

అంబులెన్సుల ప్రాంతీయ పర్యవేక్షకుడు అనిల్‌కుమార్‌

సాక్షి, అమరావతి: డాక్టర్‌ వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవా రథాల్లో పశు వైద్యులు, పారా వెట్‌లు, డ్రైవర్లుగా పనిచేసేందుకు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని అంబులెన్స్‌ల ప్రాంతీయ పర్యవేక్షకుడు అనిల్‌ కుమార్‌ ఓ ప్రకటనలో కోరారు. ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పనిచేసేందుకు సిబ్బంది కావాలని తెలిపారు.

ప్రతీ జిల్లాలో ఎనిమిది మంది పశువైద్యులు, ఎనిమిది మంది పారా వెట్‌(వెటర్నరీ టెక్నీషియన్‌)లు, ఎనిమిది మంది పైలట్ల(డ్రైవర్లు) చొప్పున మొత్తం 144 మంది సిబ్బంది అవసరమన్నారు. వెటర్నరీ వైద్యుల పోస్టులకు బ్యాచలర్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌ విద్యార్హత కలిగి ఉండాలని, కొత్తగా పట్టా పొందిన వారితో పాటు రిటైర్డ్‌ డాక్టర్లు కూడా అర్హులే అన్నారు.

పారా వెట్‌ పోస్టులకు డిప్లమో ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌ విద్యార్హత కలిగి 30 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండాలన్నారు. ఇక పైలట్‌ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండి, హెచ్‌ఎంవీ లైసెన్సుతో కనీసం 2–3 ఏళ్ల అనుభవం కలిగి ఉండాలని, 35 ఏళ్ల లోపు వారై ఉండాలని తెలిపారు. ఆసక్తి గల వారు విజయవాడలోని ముత్యాలంపాడు వీధిలోని పశుసంవర్ధక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో ఈ నెల 22, 23 తేదీల్లో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సూచించారు. ఇతర వివరాలకు 9154984484లో సంప్రదించాలన్నారు.  

మరిన్ని వార్తలు