Andhra Pradesh: రూ.1,26,622.23 కోట్ల విలువైన పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ ఆమోదం

6 Sep, 2022 03:24 IST|Sakshi

రాష్ట్రంలో 36,380 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించేలా పెట్టుబడులు

సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్‌ఐపీబీ ఆమోదం 

ఒక్క గ్రీన్‌ ఎనర్జీ రంగంలోనే రూ.81,043 కోట్ల పెట్టుబడులు  

రూ.43,143 కోట్లతో రామాయ పట్నం వద్ద ఇండోసోల్‌ సోలార్‌ ప్యానెల్, సోలార్‌ యూనిట్‌ 

కాకినాడ సెజ్‌లో రూ.1,900 కోట్లతో లైఫిజ్‌ ఫార్మా యూనిట్‌ 

వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తిలో రూ.386.23 కోట్లతో కాసిస్‌ ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ యూనిట్‌ 

కృష్ణా జిల్లా మల్లవల్లి వద్ద రూ.150 కోట్లతో అవిశా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ 

గ్రీన్‌ ఎనర్జీ యూనిట్లతో రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రం మారుతుందన్న సీఎం

నిరర్థక భూముల ద్వారా రైతులకు ఏటా ఎకరాకు లీజు రూపంలో రూ.30 వేలు

సాక్షి, అమరావతి: రాష్ట్ర పారిశ్రామిక రంగంలో నూతన శకాన్ని లిఖిస్తూ రూ.1,26,622.23 కోట్ల విలువైన పెట్టుబడులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) ఆమోదం తెలిపింది. గ్రీన్‌ ఎనర్జీ, ఫార్మా, ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాలకు చెందిన వివిధ పెట్టుబడుల ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది.

ఆయా కంపెనీల ఏర్పాటు ద్వారా 36,380 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ఇందులో ఒక్క గ్రీన్‌ ఎనర్జీ రంగంలోనే రూ.81,043 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇండోసోల్‌ సోలార్, ఆస్త్రా గ్రీన్, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్, అరబిందో రియాల్టీ అండ్‌ ఇన్‌ఫ్రా, ఏఎం గ్రీన్‌ ఎనర్జీ, గ్రీన్‌కో వంటి సంస్థలు పర్యావరణ ఉపయుక్తమైన ఆరు పంప్డ్‌ స్టోరేజ్‌ విద్యుత్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాయి.

ఈ ఆరు గ్రీన్‌ ఎనర్జీ ప్లాంట్ల ద్వారా 17,930 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కానుంది. ఈ యూనిట్ల ద్వారా 20,130 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. వీటితో పాటు నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద ఇండోసోల్‌ సోలార్‌ కంపెనీ మరో రూ.43,143 కోట్లతో మెటలర్జికల్‌ గ్రేడ్‌ సిలికాన్, పాలీ సిలికాన్, ఫ్లోట్‌.. రోల్డ్‌ గ్లాసెస్‌ తయారీ యూనిట్‌తో పాటు సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది.

కాకినాడ సెజ్‌ వద్ద రూ.1,900 కోట్ల పెట్టుబడితో లైఫిజ్‌ ఫార్మా, వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తి వద్ద కాసిస్‌ రూ.386.23 కోట్లతో ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ కేంద్రం, కృష్ణా జిల్లా మల్లవల్లి వద్ద రూ.150 కోట్లతో అవిశాఫుడ్స్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ప్రతిపాదనలకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది.

ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌ శాఖ) బూడి ముత్యాలనాయుడు, విద్యుత్, అటవీ, పర్యావరణ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్, సీఎస్‌ సమీర్‌ శర్మ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఎస్‌ఐపీబీ సమావేశంలో మంత్రులు, అధికారులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

పెట్టుబడుల ప్రతిపాదనల వివరాలు
► రూ.286.23 కోట్లతో కాసిస్‌ ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ యూనిట్‌.
► వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తిలో పరిశ్రమను ఏర్పాటు చేయనున్న కాసిస్‌ ఇ – మొబిలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌.
► రూ.386.23 కోట్ల పెట్టుబడి పెట్టనున్న కంపెనీ. ఇందులో ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ కోసం రూ.286.23 కోట్లు, చార్జింగ్‌ మౌలిక సదుపాయాల కోసం రూ.100 కోట్ల పెట్టుబడి.
► తొలి విడతలో అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని 1,000 ఎలక్ట్రిక్‌ బస్సులు తయారు చేయాలని లక్ష్యం.
► 1200 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు. 

రూ.1,900 కోట్లతో లైఫిజ్‌ ఫార్మా యూనిట్‌
► కాకినాడ ఎస్‌ఈజెడ్‌లో యూనిట్‌ ఏర్పాటు చేయనున్న లైఫిజ్‌ ఫార్మా.
► మొత్తంగా రూ.1,900 కోట్ల పెట్టుబడి పెట్టనున్న కంపెనీ.
► 2 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు.
► ఏప్రిల్‌ 2024 నాటికి కంపెనీ ఏర్పాటు పూర్తి చేయాలని లక్ష్యం.
► ఏపీఐ డ్రగ్‌ తయారీలో చైనా దిగుమతులపై ఆధార పడకుండా.. స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు.
► పరిశ్రమ కోసం ఇప్పటికే 236.37 ఎకరాలు సేకరించిన కంపెనీ. 

రూ.150 కోట్లతో అవిశా ఫుడ్స్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌
► కృష్ణా జిల్లా మల్లవల్లిలో మెగా ఫుడ్‌పార్క్‌ను ఏర్పాటు చేయనున్న అవిశా ఫుడ్స్‌ లిమిటెడ్‌.
► రూ.150 కోట్ల పెట్టుబడి, 2,500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు.
► 2023 మార్చి నాటికి పూర్తి చేసే దిశగా కంపెనీ అడుగులు.
► ఇందు కోసం 11.64 ఎకరాల భూమి కేటాయింపు.

రూ.43,143 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ సోలార్‌ మాడ్యూల్‌ తయారీ యూనిట్‌
► మెటలర్జికల్‌ గ్రేడ్‌ సిలికాన్, పాలీ సిలికాన్, ఫ్లోట్‌ అండ్‌ రోల్డ్‌ గ్లాసెస్‌ తదితర వాటి తయారీ కోసం పరిశ్రమతో పాటు సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్న ఇండోసోల్‌ సోలార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.
► మూడు విడతల్లో మొత్తంగా రూ.43,143 కోట్ల పెట్టుబడి. 
► 11,500 మందికి ప్రత్యక్షంగా, 11 వేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు. 
► నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద 5,147 ఎకరాల్లో తయారీ పరిశ్రమ, దీంతో పాటు 50 గిగావాట్లు, 10 గిగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టులను నెలకొల్పనున్న ఇండోసోల్‌ సోలార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌. 

రైతుల ఆదాయం పెరుగుతుంది: సీఎం 
రాష్ట్రంలో కొత్తగా వస్తున్న పెట్టుబడులతో రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రం మారడంతో పాటు క్లీన్‌ ఎనర్జీలో రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పెద్దగా ఆదాయం రాని భూముల్లో గ్రీన్‌ ఎనర్జీ యూనిట్లు ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు లీజు రూపంలో ఏటా ఎకరాకు రూ.30,000 ఆదాయం వస్తుందన్నారు. ‘గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయి.

ప్రాజెక్టుల్లో భారీగా ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ పురోగమించడమే కాకుండా క్లీన్‌ ఎనర్జీలో దేశానికి ఆదర్శంగా నిలుస్తాం. రైతులకు పెద్దగా ఆదాయాలు రాని భూములకు లీజు కింద డబ్బు వస్తుంది. దీనివల్ల వారికి ఆదాయాలు పెరుగుతాయి. పరిశ్రమల ఏర్పాటు, వాటి నిర్వహణ తదితర వాటి కోసం పెద్ద ఎత్తున సంస్థలు ప్రవేశిస్తాయి. వాటి ద్వారా నైపుణ్యాభివృద్ధి జరుగుతుంది’ అని చెప్పారు.

ఆరు గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులు ఇవీ..
► వైఎస్సార్‌ జిల్లా వొంగిమల్ల వద్ద 1,800 మెగావాట్ల పంప్డ్‌ హైడ్రో స్టోరేజీ పవర్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్న ఆస్తా గ్రీన్‌ ఎనర్జీ వెంచర్స్‌  ప్రైవేట్‌ లిమిటెడ్‌. దీనికోసం రూ.8,240 కోట్ల పెట్టుబడి. ప్రత్యక్షంగా 4 వేల మందికి ఉద్యోగాలు. 1,390 ఎకరాల్లో ప్రాజెక్టు ఏర్పాటు. డిసెంబర్‌ 2029 నాటికి ఏర్పాటు చేయాలని లక్ష్యం.
► సోమశిల, ఎర్రవరం వద్ద రెండు పంప్డ్‌ హైడ్రో స్టోరేజీ పవర్‌ ప్రాజెక్టులకు ఎస్‌ఐపీబీ ఆమోదం. సోమశిల వద్ద 900 మెగావాట్లు, ఎర్రవరం వద్ద 1,200 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి. 2,100 మెగావాట్ల ప్రాజెక్టు కోసం రూ.8,855 కోట్లు ఖర్చు చేయనున్న షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌. 1600 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు. జూలై 2029 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం.
► అవుకు, సింగనమల వద్ద రెండు పంప్డ్‌ హైడ్రో స్టోరేజ్‌ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన ఎస్‌ఐపీబీ. మొత్తంగా రూ.6,315 కోట్ల పెట్టుబడి పెట్టనున్న అరబిందో రియాల్టీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌. 1,600 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు. అవుకు వద్ద 800 మెగావాట్లు, సింగనమల వద్ద 800 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టులు. డిసెంబర్‌ 2028 నాటికి ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి చేయాలని లక్ష్యం. 
► వైఎస్సార్‌ జిల్లా పైడిపాలెం వద్ద పంప్డ్‌ హైడ్రో, సోలార్, విండ్‌ పవర్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్న ఇండోసోల్‌ సోలార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌. 7,200 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి కోసం రూ.33,033 కోట్లు ఖర్చు చేయనున్న కంపెనీ. పైడిపాలెం ఈస్ట్‌ 1,200 మెగావాట్లు, నార్త్‌ 1,000 మెగావాట్లు, 3,500 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టు, 1500 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్టుల ఏర్పాటు. 7,200 మందికి ప్రత్యక్షంగా ఉపాధి. డిసెంబర్‌ 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం. ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన ఎస్‌ఐపీబీ.
► కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సోలార్, విండ్‌ పవర్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్న ఏఎం గ్రీన్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌. రూ.5 వేల కోట్ల పెట్టుబడి. ఆమోదం తెలిపిన ఎస్‌ఐపీబీ. 1,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు. 700 మెగావాట్ల సోలార్, 300 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్న కంపెనీ. మార్చి 2025 నాటికి ప్రాజెక్టులు పూర్తి చేయాలని లక్ష్యం. 
► కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పంప్డ్, సోలార్, విండ్‌ పవర్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్న గ్రీన్‌కో. 1,680 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు, 2,300 మెగావాట్ల సోలార్, 250 మెగావాట్ల విండ్‌ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేయనున్న గ్రీన్‌కో. మొత్తంగా రూ.19,600 కోట్ల పెట్టుబడి. 4,230 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు. సెప్టెంబర్‌ 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం.   

మరిన్ని వార్తలు