టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే..

17 Feb, 2022 21:00 IST|Sakshi

రూ.3,096 కోట్లతో టీటీడీ బడ్జెట్‌కు ఆమోదం

త్వ‌ర‌లో ఆర్జిత సేవ‌ల పున‌రుద్ధ‌ర‌ణ‌

టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి

సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం 2022-23 బడ్జెట్‌ను రూ.3,096.40 కోట్లతో ఆమోదించినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కోవిడ్-19 నిబంధ‌న‌లను స‌డ‌లించిన నేప‌థ్యంలో త్వ‌ర‌లో కోవిడ్‌కు ముందులాగా శ్రీ‌వారి ఆర్జిత సేవ‌లు పున‌రుద్ధ‌రించ‌డంతో పాటు, స‌ర్వ‌ ద‌ర్శ‌నం, శీఘ్ర ద‌ర్శ‌నం టికెట్ల సంఖ్య‌ను క్ర‌మంగా పెంచాల‌ని బోర్డు తీర్మానించిన‌ట్లు చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో  టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. అనంతరం మీడియా సమావేశంలో చైర్మన్  వివరాలు తెలిపారు.

రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశాల మేర‌కు టీటీడీ ఆధ్వ‌ర్యంలో రూ.230 కోట్ల‌తో శ్రీ ప‌ద్మావ‌తి చిన్న‌పిల్లల సూప‌ర్ స్పెషాలిటి ఆసుప‌త్రి భ‌వ‌నాల‌ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ఆసుప‌త్రి భ‌వ‌న నిర్మాణాలు రెండు సంవ‌త్స‌రాల్లోపు పూర్తి చేయాల‌ని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి త్వ‌ర‌లో సీఎం జగన్‌తో భూమిపూజ చేయించి టెండ‌ర్ల ప్ర‌క్రియ ప్రారంభిస్తామన్నారు. శ్రీ ప‌ద్మావ‌తి హృద‌యాల‌యంకు అవ‌స‌ర‌మైన వైద్య ప‌రిక‌రాల కోనుగోలుకు టీటీడీ జెఈవో ఆధ్వ‌ర్యంలో నిపుణుల క‌మిటీని పాలకమండలి ఏర్పాటు  చేసిందన్నారు.

ప‌ద్మావ‌తి హృద‌యాల‌యం ప్రారంభించి 100 రోజుల‌లో 100 అప‌రేష‌న్లు నిర్వ‌హించాం. తిరుప‌తిలో గ‌రుడ వార‌ధి నిర్మాణం కోసం ఏడాదిలో ద‌శ‌ల వారీగా టీటీడీ వాటా నుండి రూ.150 కోట్లు చెల్లించి, వ‌చ్చే ఏడాది డిసెంబ‌రు నాటికి శ్రీ‌నివాస సేతు ఫ్లైఓవ‌ర్‌ను ప్ర‌జ‌ల‌కు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. రూ.2.73 కోట్ల‌తో స్విమ్స్‌కు కంప్యూట‌ర్లు కోనుగోలు చేసి పూర్తి స్థాయిలో కంప్యూట‌రీక‌ర‌ణ‌కు ఆమోదం తెలిపింది. టీటీడీ ఉద్యోగులు, పెన్ష‌న‌ర్లకు కార్పొరేట్ ఆసుప‌త్రుల్లో న‌గ‌దు ర‌హిత వైద్యం అందించ‌డానికి రూ.25 కోట్లు నిధి ఏర్పాటు. తిరుచానూరు స‌మీపంలోని శ్రీ ప‌ద్మావ‌తి నిల‌యంను బాలాజి జిల్లా క‌లెక్ట‌రెట్‌గా రాష్ట్ర ప్ర‌భుత్వానికి టిటిడి నిబంధ‌న‌ల మేర‌కు లీజుకు ఇచ్చేందుకు నిర్ణ‌యం తీసుకొన్నారు.

తిరుమ‌ల మాతృశ్రీ త‌రిగొండ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలో స్టీమ్ ద్వారా అన్న‌ప్ర‌సాదాల త‌యారు చేస్తున్న విష‌యం తెలిసిందే. టీటీడీ గ్యాస్‌, డిజిల్ ద్వారా కేజి స్టీమ్ త‌యారీకి 4 రూపాయ‌ల 71 పైస‌లు ఖ‌ర్చు చేస్తోంది. ఎన్‌ఈడీసీఏపీ వారు సోలార్ సిస్ట‌మ్ ఆర్‌ఈఎస్‌సీవో మోడ‌ల్ స్టీమ్‌ను కేజి 2 రూపాయ‌ల 54 పైస‌లతో 25 సంవ‌త్స‌రాల పాటు స‌ర‌ఫ‌రా చేయ‌డానికి టీటీడీ ఒప్పందం కుదుర్చుకుంది. త‌ద్వారా టీటీడీకి దాదాపు రూ.19 కోట్లు ఆదాయం చేకూరుతుంది. తిరుమ‌ల‌లో రాబోవు రోజుల్లో హోట‌ళ్ళు, ఫాస్టు ఫుడ్ సెంట‌ర్లు లేకుండా చేసి అన్ని ముఖ్య కూడ‌ళ్ళ‌లో ఉచితంగా అన్న‌ప్ర‌సాదాలు అందించాల‌ని నిర్ణ‌యం. అత్యున్న‌త స్థాయి నుండి సామాన్య భ‌క్తుడి వ‌ర‌కు ఒకే ర‌క‌మైన ఆహారం అందించాల‌ని తీర్మానం చేసింది పాలకమండలి. ఈ నిర్ణ‌యం వ‌ల్ల ఇబ్బంది ప‌డే వ్యాపారుల‌కు ఇత‌ర వ్యాపారాలు చేసుకోవ‌డానికి లైసెన్స్‌లు మంజూరు చేయాల‌ని టీటీడీ అధికారులకు ఆదేశించారు.

తిరుప‌తిలోని అలిపిరి వ‌ద్ద సైన్స్‌సిటి నిర్మాణానికి మంజూరు చేసిన 70 ఎక‌రాల భూమిలో 50 ఎక‌రాలు వెన‌క్కు తీసుకుని ఆధ్యాత్మిక న‌గ‌రం నిర్మించాల‌ని ,ఈ ప‌నుల‌కు త్వ‌ర‌లో ముఖ్య‌మంత్రితో శంకుస్థాప‌న‌ చేస్తారని చైర్మన్ తెలిపారు. తిరుమ‌ల నాద‌నీరాజ‌న మండ‌పం షెడ్డు స్థానంలో శాశ్వ‌త మండ‌పం నిర్మించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. అన్న‌మ‌య్య మార్గం త్వ‌ర‌లో భ‌క్తుల‌కు అందుబాటులోకి తేవ‌డానికి ఇప్పుడు ఉన్న మార్గాన్ని అభివృద్ధి చేయాల‌ని తీర్మానించింది పాలకమండలి. అట‌వీ శాఖ అనుమ‌తులు ల‌భించిన త‌రువాత పూర్తి స్థాయిలో అభివృద్ధి ప‌నులు చేప‌డతామని చైర్మన్ పేర్కొన్నారు.

రూ.3.60 కోట్ల‌తో టీటీడీ ఆయుర్వేద ఫార్మ‌శీకి ప‌రిక‌రాలు కొనుగోలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆయుర్వేద మందులు అందుబాటులో ఉంచాల‌ని తీర్మానించారు. శ్రీ‌వారి ఆల‌య మ‌హ‌ద్వారం, బంగారువాకిలి, గోపురంకు బంగారు తాప‌డం చేయించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. గోపురాల బంగారు తాప‌డం విష‌యంపై ఆగ‌మ పండితుల‌తో చ‌ర్చించి క్రేన్ స‌హ‌యంతో తాప‌డం ప‌నులు పూర్తి చేయించే సాధ్యాసాధ్యాలు ప‌రిశీలించాల‌ని అధికారుల‌కు ఆదేశం జారీచేసారు చైర్మన్. సామాన్య భ‌క్తులకు కేటాయించే ఆర్జిత సేవా టికెట్ల ధ‌ర‌లు పెంచిన‌ట్లు మీడియాలో జ‌రిగిన ప్ర‌చారం ఆవాస్త‌వమని, ధర పెంచే ఆలోచన మా పాలకమండలికు లేదని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు