APPSC Group 1 2018 Final Results: ఏపీపీఎస్సీ 2018 గ్రూప్‌-1 ఫలితాల ప్రకటన.. త్వరలో మరో 13 నోటిఫికేషన్లు: బోర్డు

5 Jul, 2022 18:30 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 2018 గ్రూప్‌ 1 ఫలితాలు ప్రకటించింది. ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ మంగళవారం సాయంత్రం ఫలితాలను విడుదల చేశారు. 

మొత్తం లక్షా నలభై వేల మంది పరీక్షలు రాయగా. స్క్రీనింగ్‌ టెస్ట్‌కి యాభై వేల మందికి పైగా హాజరయ్యారు. 167 గ్రూప్ వన్ పోస్టులకి గాను 325 మంది ఇంటర్వ్యూలకి హాజరయ్యారు. కరోనాతో పాటు న్యాయపరమైన అంశాల వల్ల ఫలితాలు ప్రకటించడం ఆలస్యమైందని ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు. ఫలితాల్లో.. పిఠాపురం ప్రాంతానికి చెందిన సుష్మితకు ఫస్ట్‌ ర్యాంక్‌ దక్కింది. వైఎస్సార్‌ జిల్లా కొత్తులగుట్టకు చెందిన శ్రీనివాసులుకు రెండో ర్యాంక్‌, హైదరాబాద్‌కు చెందిన సంజన సిన్హాకు మూడో ర్యాంక్‌ దక్కింది. మొదటి పది స్ధానాలలో ఏడుగురు మహిళలు ఉండడం గమనార్హం.

గ్రూప్‌-1 2018 నోటిఫికేషన్‌లో 167 పోస్టులకుగానూ.. 165 పోస్టులకు ఇప్పుడు ఫలితాలు ఇచ్చారు. వీటిలో  30 పోస్టులు డిప్యూటీ కలెక్టర్, 28 డిఎస్పీ పోస్టులు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 12వ తేదీలోపు బోర్డు ముందు హాజరై.. హామీ పత్రం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారాయన.  వచ్చే నెలలోనే గ్రూప్‌-2 నోటిఫికేషన్లు ఉంటాయని, రాబోయే కాలంలో మరో 13 నోటిఫికేషన్లు ఉంటాయని, మరో రెండు వేల పోస్టులు భర్తీ చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు