మేలుకో మహిళ.. ఈ మేటి కొలువులు నీకోసమే!

22 Nov, 2021 14:01 IST|Sakshi

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ విభాగంలో ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్స్‌

ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఏపీపీఎస్సీ

హోంసైన్స్, న్యూట్రిషన్, సోషల్‌ వర్క్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ అర్హత

రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగా ఎంపిక

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ).. మరో చక్కటి నోటిఫికేషన్‌తో ఉద్యోగార్థుల ముందుకొచ్చింది! మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ విభాగంలోని..ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌–1 పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియ ప్రారంభించింది. హోంసైన్స్, ఫుడ్‌ సైన్స్, న్యూట్రిషన్, సోషల్‌ వర్క్‌ తదితర విభాగాల్లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన మహిళలు ఈ కొలువులకు అర్హులు. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.  ఈ నేపథ్యంలో.. ఏపీపీఎస్సీ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లకు అర్హతలు, ఎంపిక విధానం, విజయం సాధించేందుకు ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం..ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న  విభాగాల్లో ఒకటి. అంతటి కీలక విభాగంలో ఖాళీగా ఉన్న ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ పోస్ట్‌ల భర్తీకి ఏపీపీఎస్సీ తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. అకడమిక్‌గా ఆయా సబ్జెక్ట్‌లపై పట్టున్న వారు ఈ పరీక్షలో విజయం సాధించడం సులభమే అంటున్నారు నిపుణులు.

► మొత్తం పోస్ట్‌ల సంఖ్య: 22
► పోస్టుల వివరాలు: ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌–1(సూపర్‌వైజర్‌) 

అర్హతలు 
ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ న్యూట్రిషన్, ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్, అప్లైడ్‌ న్యూట్రిషన్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్, క్లినికల్‌ న్యూట్రిషన్‌ అండ్‌ డైటిటిక్స్, ఫుడ్‌ సైన్సెస్‌ అండ్‌ క్వాలిటీ కంట్రోల్, ఫుడ్‌ సైన్సెస్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, ఫుడ్‌ టెక్నాలజీ అండ్‌ న్యూట్రిషన్, ఫుడ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సబ్జెక్ట్‌లలో ఏదో ఒకటి గ్రూప్‌ సబ్జెక్ట్‌గా బీఎస్సీ (బీజెడ్‌సీ) ఉత్తీర్ణత ఉండాలి.  

► హోంసైన్స్‌/సోషల్‌ వర్క్‌/సోషియాలజీ/ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ న్యూట్రిషన్‌లో.. ఉన్నత విద్య  అర్హతలు ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. 

వయో పరిమితి
►వయసు జూలై 1, 2021 నాటికి 18–42ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.

ప్రారంభ వేతనం
► ఏపీపీఎస్సీ భర్తీ చేయనున్న మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలోని సబార్డినేట్‌ సర్వీస్‌లోని ఈ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలను గ్రేడ్‌–1 హోదా పోస్ట్‌లుగా పేర్కొన్నారు. ఈ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్లనే సూపర్‌వైజర్లుగా కూడా పిలుస్తారు. వీరికి వేతన శ్రేణి రూ.24,440–రూ.71,510గా ఉంటుంది. 

ఎంపిక విధానం
ఆన్‌లైన్‌ విధానం(కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌)లో జరిగే రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక చేస్తారు. ఈ ఆన్‌లైన్‌ పరీక్షలో రెండు పేపర్లు మొత్తం 300 మార్కులకు ఉంటాయి. పేపర్‌ 1 జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ 150 ప్రశ్నలు–150 మార్కులకు; పేపర్‌ 2 హోం సైన్స్‌ అండ్‌ సోషల్‌ వర్క్‌ 150 ప్రశ్నలు–150 మార్కులకు నిర్వహిస్తారు.

► ప్రశ్నలన్నింటినీ ఆబ్జెక్టివ్‌ తరహా బహుళైచ్ఛిక విధానంలోనే అడుగుతారు. 
► ఈ రాత పరీక్ష కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ)గా నిర్వహిస్తారు.
► ఒక్కో పేపర్‌కు పరీక్ష సమయం రెండున్నర గంటలు ఉంటుంది.
► ప్రతి తప్పు సమాధానానికి సదరు ప్రశ్నకు కేటాయించిన మార్కుల నుంచి 1/3 తగ్గిస్తారు. 

రాత పరీక్షలో మెరిట్‌
ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లకు అభ్యర్థులు రాత పరీక్షలో సాధించిన మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. అందుబాటులో ఉన్న పోస్ట్‌లు, రిజర్వ్‌డ్‌ కేటగిరీలకు కేటాయించిన పోస్ట్‌లు తదితర నిబంధనలను పరిగణనలోకి తీసుకొని.. ఆయా కేటగిరీల్లో మెరిట్‌ జాబితా రూపొందించి నియామకాలు ఖరారు చేస్తారు. 

దరఖాస్తు విధానం:
► ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: నవంబర్‌ 18–డిసెంబర్‌ 8, 2021
► అప్లికేషన్‌ ఫీజు చెల్లింపు చివరి తేదీ: సెంబర్‌ 7, 2021
► ఆన్‌లైన్‌ దరఖాస్తులో సవరణ:దరఖాస్తు చివరి తేదీ నుంచి ఏడు రోజుల లోపు సవరణలు చేసుకోవచ్చు.
► వెబ్‌సైట్‌ https://psc.ap.gov.in/

రాత పరీక్షలో రాణించాలంటే
► రెండు పేపర్లుగా నిర్వహించే ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ రాత పరీక్షలో రాణించేందుకు అభ్యర్థులు పక్కా ప్రిపరేషన్‌ ప్రణాళికతో ముందుకు సాగాలి. 

► పేపర్‌–1(జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ) అంతర్జాతీయంగా, జాతీయ స్థాయిలో ప్రాధాన్యం సంతరించుకున్న అంశాలు, సమకాలీన పరిణామాలపై పట్టు సాధించాలి. తాజాగా ముగిసిన కాప్‌ సదస్సు, ఆయా అంశాలకు సంబంధించి ఐరాస నివేదికలు, భారత్‌–ఇతర దేశాల మధ్య ఇటీవల కాలంలో జరిగిన ద్వైపాక్షిక సమావేశాలు, ఒప్పందాలు తదితరాలపై అవగాహన పెంచుకోవాలి.

►రాజకీయ, ఆర్థిక, సామాజిక, శాస్త్ర, సాంకేతిక రంగాలు, కళలు, క్రీడలు, సంస్కృతి, పాలనకు సంబంధించి జాతీయ అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న అంశాలపై పట్టు సాధించాలి.

► కరెంట్‌ ఆఫైర్స్‌కు సంబంధించి.. పరీక్షకు నెల రోజుల ముందు నుంచి అంతకుముందు సంవత్సర కాలంలో చోటు చేసుకున్న పరిణామాలపై దృష్టి పెట్టాలి.

► ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమకాలీన అంశాలకు సంబంధించి తాజా పాలసీలు, పథకాలు, నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలపై గణాంక సహిత సమాచారంతో సిద్ధంగా ఉండాలి.

►మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు చెందిన పోస్ట్‌లకు పరీక్ష నిర్వహిస్తున్న∙నేపథ్యంలో.. ఏపీలో మహిళలు, చిన్నారుల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, వారి కోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గురించి తెలుసుకోవాలి.

► ఆంధ్రప్రదేశ్‌ చరిత్రకు ప్రాధాన్యం ఇస్తూ.. ఆధునిక భారత దేశ చరిత్రలోని ముఖ్యమైన ఘట్టాలపై పట్టు సాధించాలి. పాలిటీ, గవర్నెన్స్‌కు సంబంధించి రాజ్యాంగం, ఇటీవల కాలంలో పాలనలో చోటు చేసుకుంటున్న సాంకేతిక పరిణామాలు(ఈ–గవర్నెన్స్‌ తదితర), తాజా విధానాల గురించి తెలుసుకోవాలి. ఈ విషయంలోనూ ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పరిపాలన పరమైన నూతన విధానాలపై ప్రత్యేక దృష్టితో అధ్యయనం చేయాలి.  

► ఆర్ధికాభివృద్ధికి సంబంధించి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు.. దేశ ఆర్థిక ప్రగతి, ఆర్థికాంశాల క్రమాన్ని తెలుసుకోవాలి.

► జాగ్రఫీలో.. భారత్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక అంశాలపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా సహజ వనరులు, అవి లభించే ప్రాంతాలు, అభివృద్ధికి దోహదపడే తీరుపై అవగాహన పెంచుకోవాలి.

► ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకుంటున్న డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్, సుస్థిరాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి తాజా పరిణామాలు, అదే విధంగా ప్రాథమిక లక్ష్యాల గురించి తెలుసుకోవాలి.

► మెంటల్‌ ఎబిలిటీలో... లాజికల్‌ రీజనింగ్, డేటాలు, ఫ్లో చార్ట్స్, డేటా విశ్లేషణ నైపుణ్యాలు పెంచుకోవాలి.

► అన్నిటికంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన అనంతర పరిణామాలు, సమస్యలను ప్రత్యేక దృష్టితో చదవాలి. 

► 2021–22 బడ్జెట్‌లోని ముఖ్యమైన అంశాలు, ఏపీ, ఇండియా సోషియో–ఎకనామిక్‌ సర్వేలు, వాటిలో పేర్కొన్న ముఖ్య వివరాలను, గణాంకాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. 

పేపర్‌–2కు ఇలా
► హోంసైన్స్, సోషల్‌ వర్క్‌ సబ్జెక్ట్‌ అంశాలు రెండు విభాగాలుగా ఉండే పేపర్‌–2లో రాణించేందుకు దృష్టి పెట్టాల్సిన అంశాలు.. 

► ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ న్యూట్రిషన్‌ సబ్జెక్ట్‌లోని పలు రకాల ఆహార ధాన్యాలు, బలమైన ఆరోగ్యానికి దోహదం చేసే తృణ ధాన్యాలు గురించి తెలుసుకోవాలి.

► అదే విధంగా పోషకాహార పదార్థాలు, వాటి నిల్వ, వాటి వల్ల కలిగే లాభాలు తదితర అంశాలపై పట్టు సాధించాలి.

► ఆయా ఆహార పదార్థాల్లో ఉండే విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్‌ గురించి తెలుసుకోవాలి.

► వయో వర్గాల వారీగా అవసరమైన ఆహార, పోషకాల వివరాలు గురించి తెలుసుకోవడం కూడా మేలు చేస్తుంది.

► ఆయా వ్యాధులకు సంబంధించి అనుసరించాల్సిన ఆరోగ్య, ఆహార నియమాల గురించి తెలుసుకోవాలి. 

►  శిశు అభివృద్ధికి సంబంధించి ఇమ్యునైజేషన్, మానసిక–శారీరక అభివృద్ధి, ప్రీ–స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ప్రాధాన్యం, పాపులేషన్‌ ఎడ్యుకేషన్‌లపై దృష్టిపెట్టాలి.

►  అదే విధంగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఆయా ఏజెన్సీలు/సంస్థల ఆధ్వర్యంలో అమలవుతున్న మహిళా, శిశు సంక్షేమ సేవల గురించి తెలుసుకోవాలి. 

► చిన్నారులకు రాజ్యాంగ, శాసన పరంగా అందుబాటులో ఉన్న హక్కుల గురించి అవగాహన ఏర్పరచుకోవాలి.

► ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులు, వారి విషయంలో చేపడుతున్న చర్యలపై దృష్టి పెట్టాలి.

► వ్యవసాయానికి సంబంధించిన అంశాలు.. ముఖ్యంగా ఆహార ధాన్యాల డిమాండ్‌–సప్లయ్, సాగు ప్రణాళికలు, ప్రభుత్వ విధానాల గురించి తెలుసుకోవాలి.

► ఎక్స్‌టెన్షన్‌ వర్క్‌కు సంబంధించిన విధానాలు, పద్ధతులు, ప్రోగ్రామ్‌ ప్లానింగ్, నిర్వహణ, మూల్యాంకన, గ్రామాల్లో మహిళల ఆధ్వర్యంలోని స్వయంసహాయక సంస్థల ► అభివృద్ధి వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి.

► సోషల్‌ వర్క్‌కు సంబంధించి మూల భావన, పరిధి, స్వరూపం తెలుసుకోవాలి.

► భారతీయ సంస్కృతిలో మార్పు విషయంలో సోషల్‌ వర్క్‌ సిద్ధాంతం ప్రాముఖ్యతపై అవగాహన ఏర్పరచుకోవాలి.

►  సోషల్‌ వర్క్‌లో.. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సేవలు, వాటి మధ్య ఉన్న వ్యత్యాసాలు, స్థానిక సంస్థలు, కుటుంబం, శిశు సంక్షేమ చర్యలు, మహిళలకు ఎదురవుతున్న సమస్యలు, రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ స్వరూపం, విధులపై అవగాహన అవసరం. 

డిగ్రీ పుస్తకాల అధ్యయనం
పేపర్‌–2కు సంబంధించిన విభాగాల్లోని ప్రశ్నలు డిగ్రీ స్థాయి పుస్తకాల నుంచే అడిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సిద్ధాంతాలు, మూల భావనలకు సంబంధించి డిగ్రీ స్థాయి పుస్తకాల అభ్యసనం మేలు చేస్తుంది. సంక్షేమ పథకాలు, సేవలు, సమస్యలకు సంబంధించి సమకాలీన అంశాలను నిరంతరం పరిశీలిస్తూ ఉండాలి. ఇలా ఒకవైపు బేసిక్స్, మరోవైపు సమకాలీన పరిణామాలపై అవగాహన పెంచుకుంటూ.. ప్రిపరేషన్‌ సాగిస్తే విజయావకాశాలు మెరుగవుతాయి.

మరిన్ని వార్తలు