ఏపీ–తెలంగాణ బస్సు రూట్లు ఖరారు

8 Nov, 2020 02:54 IST|Sakshi

12 రూట్లలో నిత్యం 638 బస్సులు

విజయవాడ నుంచి తెలంగాణకు వెళ్లే రూట్‌లో గణనీయంగా తగ్గింపు  

సాక్షి, అమరావతి: ప్రతిరోజూ ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణకు వెళ్లే బస్సు రూట్లను ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రకటించింది. 13 జిల్లాల్లోని 12 రూట్లలో మొత్తం 638 బస్సులు తిప్పనుంది. ఇందులో ఒక్క హైదరాబాద్‌కే 534 బస్సులు నడపనుంది. తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు 104 బస్సులు తిప్పేలా ఏపీఎస్‌ఆర్టీసీ ప్రణాళిక రూపొందించింది. విజయవాడ నుంచి తెలంగాణకు వెళ్లే రూట్‌లో బస్సుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గతంలో 264 బస్సుల్ని నడపగా.. ఇప్పుడు 166కు పరిమితమైంది. ఇక 1,60,999 కిలోమీటర్లలో హైదరాబాద్‌కు 1,49,998 కిలోమీటర్లు, తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు 11,001 కిలోమీటర్ల మేర నడిపేందుకు సిద్ధమైంది. గతంలో ఏపీఎస్‌ఆర్టీసీ 2,65,367 కిలోమీటర్ల మేర తెలంగాణ భూ భాగంలో బస్సులు తిప్పేది. కాగా, ఖరారైన బస్సు రూట్లను టీఎస్‌ఆర్టీసీకి ఏపీఎస్‌ఆర్టీసీ పంపించింది.

టీఎస్‌ఆర్టీసీ కూడా తెలంగాణ నుంచి ఏపీకి ఇవే రూట్లలో తమ సర్వీసులు నడపనుంది. ఈ నెల 2న ఏపీ, తెలంగాణ మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం ఖరారైన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి ఏపీఎస్‌ ఆర్టీసీ 452 బస్సులు తెలంగాణకు నడుపుతుండగా.. ఆక్యుపెన్సీ 67 శాతంగా నమోదవుతోంది. 452 బస్సుల్లో 389 హైదరాబాద్‌కు, 63 తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు తిప్పుతున్నారు. వీటి ద్వారా ఏపీఎస్‌ ఆర్టీసీకి రోజుకు రూ.68.17 లక్షల ఆదాయం వస్తోంది. ఒక్క హైదరాబాద్‌ రూట్‌ ద్వారా రూ.59.30 లక్షల ఆదాయం వస్తోంది.   

మరిన్ని వార్తలు