టీఎస్‌ఆర్టీసీ కోరినట్లే ప్రతిపాదనలు పంపాం

24 Oct, 2020 05:44 IST|Sakshi

ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు 

ప్రయాణికులకు ఇబ్బందులు తొలగించాలనే కి.మీ. తగ్గించుకున్నాం

నష్టం వస్తున్నా ప్రజల కోసం సర్వీసులు నడపాలన్నదే మా ఉద్దేశం 

సాక్షి, అమరావతి: తెలంగాణ ఆర్టీసీ అధికారులు కోరినట్లే ప్రతిపాదనలు పంపించామని, రూట్ల వారీగా స్పష్టత ఇచ్చామని ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ, రవాణా, ఆర్‌అండ్‌బీ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు శుక్రవారం మీడియాకు తెలిపారు. ఏపీఎస్‌ ఆర్టీసీ 1.04 లక్షల కి.మీ. తగ్గించుకుందని, 1.61 లక్షల కి.మీకే పరిమితం అయ్యామని చెప్పారు. ఈ ప్రతిపాదనలతో ఏపీఎస్‌ ఆర్టీసీకి నష్టం వస్తున్నా ప్రయాణికుల ఇబ్బందులను దృష్ట్యా టీఎస్‌ ఆర్టీసీ డిమాండ్లకు అంగీకరించామని వివరించారు. ఈ నెల 19నే తుది ప్రతిపాదనలు పంపించామని, వాళ్లు కోరినట్లు ప్రతిపాదనలు పంపినా ఇంకా గందరగోళం ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. 

► విజయవాడ – హైదరాబాద్‌ రూట్లో ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు తగ్గించాలని తెలంగాణ అధికారులు కోరారు. వారి విజ్ఞప్తి మేరకు 322 బస్సులను తగ్గిస్తూ ప్రతిపాదనలు పంపించాం.
► ఏపీ, తెలంగాణ మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం కుదిరేలోగా రెండు రాష్ట్రాల ఆర్టీసీలు 70 వేల కి.మీ. చొప్పున బస్సులు నడుపుదామని ప్రతిపాదించినా వారు అంగీకరించలేదు.
► 2 రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో రోజుకు రూ. 3.50 కోట్ల వరకు నష్టం వాటిల్లుతోంది. 

మరిన్ని వార్తలు