రారండోయ్‌ పంచారామాలు చూద్దాం.. 

7 Nov, 2021 07:23 IST|Sakshi
తుని నుంచి పంచారామ క్షేత్రాలకు ఏర్పాటు చేసిన బస్సులు

పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

అందుబాటులో టికెట్‌ ధరలు

బృందాలకు ఇంటి నుంచే ప్రత్యేక సర్వీసులు  

తుని: పవిత్ర కార్తిక మాసంలో పంచారామ క్షేత్రాలను దర్శించుకుంటే పుణ్యమని భక్తుల నమ్మకం. అందుకే ఈ మాసంలో ఎక్కువ మంది శైవ క్షేత్రాలను దర్శించుకునేందుకు ఆసక్తి చూపుతారు. ఒక కుటుంబం పంచారామాలను దర్శించుకోవడానికి వెళ్లాలంటే ఆర్థికంగా భారం పడుతుంది. ఇది గమనించిన ఆర్టీసీ కార్తికమాసంలో పంచారామాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను  నడుపుతోంది.

చదవండి: నాడు ఫిరంగులకు..నేడు పకోడీలకు ప్రసిద్ధి

తుని డిపో నుంచి సర్వీసులు  
తుని ఆర్టీసీ డిపో నుంచి పంచారామాలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్‌ లగ్జరీ బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. తుని నుంచి ఈ నెల 7, 14, 21, 28 తేదీల్లో ఆదివారం సాయంత్రం బయలుదేరి సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు  అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామ, సామర్లకోట తదితర శైవ క్షేత్రాలకు తీసుకువెళతారు. దర్శనం అనంతరం భక్తులను తుని డిపోకు తీసుకువస్తారు.

రిజర్వేషన్‌ సౌకర్యం 
తుని ఆర్టీసీ డిపోతో పాటు పాయకరావుపేట, గొల్ల అప్పారావు సెంటర్, అన్నవరం, కత్తిపూడి తదితర ప్రాంతాల్లో రిజర్వేషన్‌ టికెట్లు పొందవచ్చు. దీంతో పాటు ఆన్‌లైన్‌లో టికెట్లను రిజర్వేషన్‌ చేయించుకునే అవకాశం కల్పించారు.

బృందాలకు ప్రత్యేకం  
పంచారామ క్షేత్రాలను దర్శించుకోవడానికి బృందాలుగా వెళ్లే వారికి ఆర్టీసీ వారి స్వగ్రామం నుంచే బస్సు సౌకర్యం కల్పిస్తోంది. బస్సు సీటింగ్‌ కెఫాసిటీ మేరకు టికెట్లు ఉంటే వారి నివాస గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తారు. నాలుగైదు సీట్లు మిగిలిపోయినా బస్సును అందిస్తామని అధికారులు చెబుతున్నారు.

చార్జీలు ఇలా.. 
పంచారామ క్షేత్రాలకు వెళ్లే భక్తులకు బస్సు కేటగిరి ఆధారంగా పెద్దలకు, పిల్లలకు వేర్వేరు టికెట్‌ ధరలు ఉంటాయి. తుని డిపో నుంచి పల్లెవెలుగు పెద్దలకు రూ.720, పిల్లలకు రూ.570, అల్ట్రా డీలక్స్‌ పెద్దలకు రూ.1040, పిల్లలకు రూ.810, సూపర్‌ లగ్జరీ పెద్దలకు రూ.1080, పిల్లలకు రూ.840గా టికెట్‌ ధర నిర్ణయించారు.

ఉద్యోగులు, వ్యాపారులకు.. 
ఉద్యోగులు, వ్యాపారుల సౌకర్యం కోసం శనివారం బస్సులు బయలు దేరి ఆదివారం సాయంత్రానికి తిరిగి చేరుకునే ఏర్పాట్లు చేశారు. ఈ నెల13, 20, 27 తేదీల్లో వీరికి ప్రత్యేక బస్సులు నడుపుతారు.

భక్తులకు మంచి అవకాశం 
పవిత్ర కార్తిక మాసంలో పంచారామ క్షేత్రాలకు వెళ్లే భక్తులకు కండీషన్‌లో ఉన్న బస్సులను తుని డిపో నుంచి నడుపుతున్నాం. రెగ్యులర్‌ భక్తులతో పాటు ఉద్యోగులు, వ్యాపారులకు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తున్నాం. వీటితో పాటు బృందంగా వెళ్లే భక్తులను వారి స్వగ్రామం నుంచే పికప్‌ చేసుకుని తిరిగి ఇంటికి చేర్చుతాం. భక్తులు ఆర్టీసీ సేవలను సద్విని యోగం చేసుకోవాలి. 
–ఎన్‌.కిరణ్‌కుమార్, తుని డిపో మేనేజర్‌ 

టికెట్ల రిజర్వేషన్, అదనపు వివరాలకు...  
తుని డిపో మేనేజర్‌: 99592 25539 
అసిస్టెంట్‌ మేనేజరు: 94928 33885 
ఎంక్వయిరీ : 08854–253666 
రిజర్వేషన్‌: 73829 13216, 73829 13218  

మరిన్ని వార్తలు