మేత కంపెనీల అదనపు భారం

3 Aug, 2020 04:46 IST|Sakshi

కిలోకు రూ.6 పెంచడంపై ఆక్వా రైతుల ఆందోళన

ప్రధాని, సీఎంలకు లేఖ

సాక్షి, అమరావతి: కరోనా కారణంగా ఎగుమతులు తగ్గి నష్టపోతున్న ఆక్వా రైతులపై మేత కంపెనీలు అదనపు భారాన్ని మోపుతున్నాయి. మార్కెట్‌లో 80 శాతం అమ్మకాలు కలిగిన మూడు ప్రధాన కంపెనీలు నెల కిందటే కిలోకు రూ.6 వరకు ధర పెంచాయి. అప్పటి వరకూ కిలో రూ.81 వరకూ ఉన్న ధర రూ.87కు చేరింది. దీంతో రాష్ట్రంలోని ఆక్వా రైతులపై దాదాపు రూ.600 కోట్ల భారం పడుతోందని ఆ రంగానికి చెందిన నిపుణులంటున్నారు. రాష్ట్రంలో వనామితోపాటు తీర ప్రాంతాల్లోని రైతులు సంప్రదాయ విధానంలో దాదాపు రెండు లక్షల ఎకరాల్లో రొయ్యలను సాగు చేస్తున్నారు. వనామి సాగు చేస్తున్న రైతులు మేత అధికంగా వాడాల్సి ఉండటంతో వారిపై అదనపు భారం పడుతోంది.  

► ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ధర పెంచని ఆక్వా కంపెనీలు ఇతర దేశాలకు ఎగుమతులు ప్రారంభమయ్యాక రేట్లను పెంచాయి. 
► ఈ నేపథ్యంలో తమ ఇబ్బందులపై ప్రాన్‌ ఫార్మర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధులు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి లేఖలు రాశారు. 
► పెంచిన రేట్లపై పునరాలోచన చేయాలని ఆయా కంపెనీల ప్రతినిధులను ఆ నాడు సీఎం కార్యాలయం కోరింది.  
► దీంతో ప్రధాన కంపెనీలన్నీ డీలర్‌ రేటుపై కిలోకు రూపాయి వరకూ ధర తగ్గించాయి. 
► అయితే తగ్గించిన రేట్లు అమలవుతున్నా రైతులపై ఆర్థిక భారం పడుతోందని, కరోనాకు ముందున్న రేట్లనే అమలు చేయాలని కోరుతూ మరోసారి ప్రాన్‌ ఫార్మర్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు ఐపీఆర్‌ మోహన్‌రాజు ప్రధాని, సీఎంలకు లేఖలు రాశారు.  

>
మరిన్ని వార్తలు