సాయుధ దళాల కుటుంబాలకు గవర్నర్‌ సత్కారం

7 Dec, 2020 14:23 IST|Sakshi

సాక్షి, రాజ్‌భవన్ : దేవ సరిహద్దులో రక్షణలో అసువులు బాస్తున్న సాయుధ దళాల సిబ్బందిని స్మరించుకోవటం అత్యావశ్యకమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విజయవాడ రాజ్ భవన్ దర్బార్ హాల్లో సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతావని రక్షణలో వీర మరణం పొందిన సాయుధ దళాల కుటుంబ సభ్యులను గవర్నర్  ప్రత్యేకంగా సన్మానించారు. మాతృభూమి రక్షణలో సైనికులు చూపిన ధైర్య సాహసాలు, త్యాగాలను పతాక దినోత్సవ వేడుకలు గుర్తుచేస్తాయని గవర్నర్ ప్రస్తుతించారు. జెండా దినోత్సవ నిధికి దేశ ప్రజలంతా తమ వంతు సహకారం అందించటం, సైనికుల కుటుంబాల పట్ల మన సంఘీభావాన్ని తెలియచేయటమేనని గవర్నర్ బిశ్వ భూషణ్ అన్నారు. (హోంగార్డులు నిస్వార్థ సేవకులు)

 దేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే, సువిశాల భారతావని రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి  ఎందరో వీరులు తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలారన్నారు.  పతాక దినోత్సవ నిధికి ప్రతి ఏటా క్రమం తప్పకుండా సహకారం అందించడానికి అంగీకరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులను ప్రత్యేకంగా అభినందించారు. సాయుధ దళాల పతాక నిధికి ప్రజల నుంచి  విరాళాలు  సేకరించటంలో ప్రథమ స్థానం దక్కించుకున్న కర్నూలు జిల్లా సైనిక సంక్షేమ అధికారి జి.రాచయ్య, ద్వితీయ స్ధానంలో నిలిచిన పశ్చిమ గోదావరి జిల్లాసైనిక సంక్షేమ అధికారి కె.వి.ఎస్. ప్రసాద రావు, జిల్లా సంయిక్త పాలనాధికారి తేజ్ భరత్, తృతీయ స్దానం దక్కించుకున్న తూర్పు గోదావరి జిల్లా సైనిక సంక్షేమ విభాగం నుండి జె.మల్లికార్జున రావులను గవర్నర్ ఈ సందర్భంగా అభినందించారు. 

2019 సంవత్సరానిగాను సాయుధ దళాల పతాక నిధి సేకరణలో పతాకాల విక్రయం,  హుండీల ద్వారా గరిష్ట వసూళ్లను సాధించడానికి వీరు ప్రత్యేకంగా కృషి చేసారు. దేశ రక్షణలో ప్రాణాలు వదిలిన విశాఖపట్నంకు చెందిన సమ్మింగి తులసీరామ్ భార్య, వీరనారి రోహిణికి గవర్నర్ ఈ సందర్భంగా నగదు పురస్కారాన్ని అందించారు. కార్యక్రమంలో అంతరంగిక శాఖ ప్రత్యేక కార్యదర్శి విజయ కుమార్, రాష్ట్ర సైనిక సంక్షేమ బోర్డు సంచాలకులు యమ్ డి హసన్ రెజా, సహాయ సంచాలకులు వివి రాజా రావు, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. (అది ఎయిర్‌ఫోర్స్‌ మిస్సైల్‌ శకలం)

మరిన్ని వార్తలు